ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాజ్యసభలో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు నుంచే జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎత్తున ముందుజాగ్రత్తలను కేంద్రం తీసుకుంది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాలను ముందు రోజు నుంచే గృహ నిర్బంధంలో ఉంచారు. ఇప్పుడు దాన్ని అరెస్టుగా మార్చి… ఈ ఇద్దరు లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉన్న ముఫ్తీని పోలీసులు ఆమెని హరినివాస్ అతిథి గృహానికి తరలించారు.
370 ఆర్టికల్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో ముఫ్తీ స్పందిస్తూ… కాశ్మీర్ ని భారత్ దురాక్రమణ చేస్తోందనీ, ఇకపై కాశ్మీర్ ని భారత్ ఆక్రమిత కాశ్మీర్ గా పిలుస్తామంటూ వివాదాస్పద ప్రకటన చేశారు. దీంతో ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా కూడా స్పందిస్తూ… కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. మరికొంతమంది నాయకుల్ని కూడా జమ్మూ కాశ్మీర్లో అరెస్టుల చేస్తున్నట్టు సమాచారం. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారనీ, మూకల్ని విధ్వంసానికి ప్రేరేపించేలా కొందరు నాయకుల వ్యాఖ్యలుంటున్నాయని పోలీసులు అధికారులు చెబుతున్నారు.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కాశ్మీర్లో ఇలాంటి కొన్ని ఉద్రిక్తతలు ఉంటాయనే అంచనా ముందే ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే బలగాలను పంపించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితి కొద్దిరోజులు తప్పదు అనే అభిప్రాయమే వ్యక్తమౌతోంది. ఎందుకంటే, కాశ్మీర్లో భారత్ వ్యతిరేకంగా పాక్ జెండాలు ఎగిరిన సందర్భాలూ, భారత్ వ్యతిరేక నినాదాలు శ్రీనగర్లో వినిపించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అంటే పరోక్షంగా ఇక్కడి మూకలకు బయట్నుంచి మద్దతు లభిస్తోందనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
ఇక, భారత ప్రభుత్వ తాజా నిర్ణయంపై పాకిస్థాన్ కూడా స్పందించింది. ఇలాంటి నిర్ణయం ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ఆ దేశం అభిప్రాయపడుతోంది. దీనిపై ఐక్యరాజ్యసమితికి వెళ్తామని అంటోంది. నిజానికి, ఇది మనదేశానికి చెందిన పూర్తిగా అంతర్గత వ్యవహారం. ఏదేమైనా, జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం కొంత ఉద్రిక్తతకు ఆస్కారం ఉందనీ, అందుకే ముందస్తుగా కొందరు నాయకుల అరెస్టుల్లాంటివి తప్పదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది.