వారిది హ్రస్వదృష్టి అనుకోవాలో.. లేదా, దీర్ఘ దృష్టి అనుకోవాలో అర్థం కావడం లేదు. బహుశా ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇలాంటి ప్రకటనలు చేయదనే చెప్పాలి. చేసేంత ధైర్యం ఉండదనే చెప్పాలి. ఆ తెగువ, చొరవ ఉన్న పార్టీ మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు గర్వించాలేమో..! అదేనండీ… తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడుకుంటున్నది. ఆంధ్రాలో సమస్యలే లేవని టోకున చెప్పేశారు కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు!
ఆంధ్రప్రదేశ్ లో అన్ని సమస్యలూ పరిష్కృతం అయిపోతున్నాయని మంత్రిగారు సెలవిచ్చారు. చర్చించేందుకు సమస్యలే లేవనీ.. అందుకే ప్రతిపక్ష వైయస్సార్ సీపీ ప్రత్యేక హోదా అంశమై పదేపదే పట్టుబడుతోందన్నారు. హోదాపై వైకాపా ఎమ్మెల్యేలు శాసన సభలో ఆందోళనకు దిగిన సందర్భంగా అచ్చెన్నాయుడు ఇలా వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో సమస్యలు ఒక్కోటిగా పరిష్కారం అయిపోతున్నాయన్నారు..! అధికార పక్షాన్ని విమర్శించేందుకు ఒక్క టాపిక్ కూడా వైకాపా దగ్గర లేదన్నారు. అందుకే, ఇంకా ప్రత్యేక హోదా అంటూ వేలాడుతూ ఉంటారని ఎద్దేవా చేశారు. వైకాపాకి ప్రత్యేక జబ్బు పట్టుకుందని కె. రవికుమార్ అన్నారు.
మొత్తానికి ప్రత్యేక హోదా పరిస్థితి ఎలా అయిందో చూడండి..! ఎన్నికల ముందు ఇదే తెలుగుదేశం పార్టీ హోదా గురించి ఏమందో ప్రజలు మరచిపోలేదు. తాము అధికారంలోకి వస్తే హోదా తెచ్చేస్తామన్నారు. భాజపా కూడా ఇదే నమ్మబలికింది. ఆ తరువాత, అమావాస్యకోసారి, పున్నానికోసారి ‘వచ్చేస్తోందీ వచ్చేస్తోందీ’ అంటూ చంద్రబాబు హిప్నటైజ్ చేస్తూ వచ్చారు. ఈ ద్విపాత్రాభినయంలో భాజపా కూడా తనవంతు పాత్రను చక్కగా పోషించింది. ఎప్పుడైతే కేంద్రం స్వరం మారిందో… చంద్రబాబు ఓకల్ కార్డ్స్ కూడా మారిపోయాయి! ఠాట్… ప్రత్యేక హోదాతో మనకు పనేంటీ, పొందిన రాష్ట్రాలు ఏవైనా బావుకున్నాయా, అంతకు మించి అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ కొత్త వాదనను ప్రజలపై రుద్దారు.
ఇప్పుడు ఎక్కడి పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే.. హోదా వాదనను జబ్బు అనే స్థాయికి తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా అనేది అంటరానిదైపోయిందిప్పుడు..! రాష్ట్రంలో సమస్యలే లేవనీ, కాబట్టి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోవడం అనవసరం అన్నట్టుగా తీర్మానించేస్తున్నారు. ఇంతకీ.. రాష్ట్రంలో సమస్యలు సాల్వ్ అయిపోతున్నాయని ఏ ప్రాతిపదిక మంత్రిగారు చెప్పారో మరి! కొన్ని ఉదాహరణలు చెప్పి, సాధించిన అభివృద్ధి గురించి కాసేపు మాట్లాడాక… ఇలాంటి వ్యాఖ్యానం చేస్తే కాస్తైనా అర్థవంతంగా ఉంటుంది. అంతేగానీ, ప్రత్యేక హోదా వాదనను సమూలంగా చిదిమేయడం కోసం… రాష్ట్రంలో సమస్యలే లేవని మాట్లాడటం కంటే అతిశయోక్తి మరోటి ఉంటుందా..? హోదా విషయంలో కేంద్రం చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు..! ఇప్పుడు తెలుగుదేశం అనుసరిస్తున్న వైఖరికి కూడా చరిత్రలో మరచిపోలేనిదిగా మిగిలిపోయేట్టు చేయడమే మంత్రిగారి లక్ష్యంగా కనిపిస్తోంది!