జిల్లాల పునర్విభజన ఓ తేనెతుట్టెలా మారింది. ఎవరినీ నారాజ్ చేయవద్దని 31 జిల్లాలకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పగానే కొత్త జిల్లాల డిమాండ్లు వెల్లువెత్తాయి. అనూహ్య డిమాండ్లు తెరపైకి వచ్చాయి. తాజాగా పీవీ నరసింహారావు పేరుతో జిల్లా కోసం డిమాండ్ వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు
హుస్నాబాద్ నియోజకవర్గం, చుట్టు పక్కల మండలాలతో పీవీ జిల్లా ఏర్పాటు కు ఆందోళన మొదలైంది. మొత్తం 16 మండలాలో ఈ జిల్లా ఏర్పాటు వల్ల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జిల్లాలో ఏయే మండలాలను కలపవచ్చో కూడా జిల్లా సాధన కమిటీ నేతలు సూచిస్తున్నారు. మంత్రి ఈటలపై ఒత్తిడి తెస్తున్నారు.
మరోవైపు, వరంగల్ జిల్లాలో ములుగు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు ఆందోళన తీవ్రమైంది. బంద్ లు రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. ములుగులో తీవ్ర స్థాయిలో ఆందోళన జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీనిపై ఆందోళనకారులు నిరసన తెలిపారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట పేరుతో కొత్త జిల్లా కోసం కూడా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. వరసగా రెండో రోజు అక్కడ బంద్ పాటించారు. స్వయంగా తెరాస ఎమ్మెల్యే రాజీనామా సమర్పించారు. అక్కడ జిల్లా సెంటిమెంట్ క్రమంగా బలపడుతోంది.
నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ పేరుతో జిల్లా ఏర్పాటుకు ఆందోళన మొదలైంది. వ్యాపారులు, యువకులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. అఖిలపక్ష నాయకులు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి పేరుతో కొత్త జిల్లా కోసం ఆందోళన జరుగుతోంది. అలాగే భద్రాచలం జిల్లా కావాలంటూ ఉద్యమం ఉధృతమవుతోంది. ఏన్కూరులో పోలీసుల జులుంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆందోళనకారులపై పోలీసలు లాఠీచార్జి చేశారు. ఒక వ్యక్తి తల పగిలింది. దీంతో ఆందోళన అదుపు తప్పుతుందేమో అనే అనుమానం వ్యక్తమవుతోంది.
31 జిల్లాలు ఫైనల్ అని కేసీఆర్ ఫిక్స్ చేసినా ఆందోళనలు ఆగటం లేదు. దసరాకు ముందు మళ్లీ సకల జనుల సమ్మెనాటి పరిస్థితులు వస్తాయేమో అనే అనుమానాలే నిజమయ్యేలా ఉన్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.