నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 2017 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా కనిపించబోతున్నార్ట. ఆయన కోసం రాఘవేంద్రరావు ఓ పాత్ర సృష్టించార్ట. చనిపోయిన ఏఎన్నార్ కోసం ఇప్పుడు రాఘవేంద్రరావు ఓ పాత్ర సృష్టించడమేమిటి?? అనుకొంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఈసినిమా కోసం గ్రాఫిక్స్ సహాయంతో ఏఎన్నార్ పాత్ర సృష్టించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ మహిమ తెలియంది కాదు. ఇటీవల కోడి రామకృష్ణ ‘నాగాభరణం’ చిత్రం కోసం కన్నడ సూపర్ స్టార్, దివంగత విష్ణువర్థన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ ప్రయోగం కన్నడ నాట హాట్ టాపిక్గా మారింది. నాగాభరణం సినిమాకి అక్కడ ఊహించనంత క్రేజ్ వచ్చింది. సరిగ్గా.. ఓం నమో వేంకటేశాయకి కూడా అదే ఫార్ములా అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.
గ్రాఫిక్స్ ద్వారా ఏఎన్నార్ పాత్రని పునసృష్టి చేయాలని రాఘవేంద్ర రావు భావిస్తున్నార్ట. అందుకోసం సీజీ వర్క్లో అపారమైన అనుభవం గల విశిష్టమైన సంస్థలతో దర్శకేంద్రుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నిజంగా ఏఎన్నార్ పాత్రని పునసృష్టి చేయగలిగితే.. ఈ సినిమాలోకి తీసుకురాగలిగితే.. అది అద్భుతమే. ఈ సినిమాకి మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాకి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. మనకు దూరమైన ఎంతోమంది నటీనటుల్ని మళ్లీ గ్రాఫిక్స్ రూపంలో చూసే అదృష్టం దక్కుతుంది. నిజంగా నమో వేంకటేశాయలో ఏఎన్నార్ కూడా కనిపిస్తే.. ఈసినిమాకి అంతకంటే కమర్షియల్ పాయింట్ ఏముంటుంది?? మరి రాఘవేంద్రుడు ఈ అద్భుతాన్ని ఎలా చేస్తాడో చూడాల్సిందే.