తెలంగాణ ఉద్యమ సమయంలో బోర్డుల మీద ఆంధ్ర అనే పదాన్ని మసిపూసి చెరిపేయడం గతం. ఎక్కడ ఆంధ్రా బ్యాంక్ బోర్డు ఉన్నా దాన్ని చెరిపేసి తెలంగాణ అని రాసేవారు ఉద్యమకారులు. ఇప్పుడు కాలం మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో నిర్మించే సాగునీటి ప్రాజెక్టుకు ఆంధ్రా బ్యాంక్ భారీగా రుణసహాయం చేస్తోంది.
తెలంగాణ ప్రాజెక్టుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆంధ్రా బ్యాంక్ 1300 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ మేరకు రుణ మంజూరు ఆమోద పత్రాన్ని కూడా అందించింది. స్వయంగా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ పటేల్ ఈ పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు.
తెలంగాణలోని మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఆంధ్రా బ్యాంక్ ఆర్థిక సహకారం అందిస్తోంది. మిషన్ భగీరథకు 1935 కోట్లు సమకూరుస్తోంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు 235 కోట్ల రుణ సాయం చేస్తోంది. సీడ్ కార్పొరేషన్ కు 400 కోట్లు ఇస్తోంది. పౌరసరఫరాల సంస్థకు వెయ్యి కోట్ల ఆర్థిక సహాయం చేస్తోంది.
పేరులో ఆంధ్రా ఉన్నా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న బ్యాంక్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో బ్రాంచీలున్న బ్యాంక్ ఇది. కొత్త రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తున్న ఆంధ్రా బ్యాంక్ కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టులను అనుకున్న ప్రకారం పూర్తి చేయడానికి వీలైనంత రుణ సహాయం పొందడానికి ప్రభుత్వం తనవంతుగా ముమ్మర ప్రయత్నం చేస్తూనే ఉంది.