ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం మూడు రోజులపాటే శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించగానే, ప్రజా సమస్యలపై చర్చించేందుకు వీలుగా ఏపి శాసనసభని కనీసం 3-4వారాలైన నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా డిమాండ్ చేసింది. కానీ ఉన్న మూడు రోజులనే సద్వినియోగం చేసుకోలేకపోయింది.
మొదటిరోజున జి.ఎస్.టి.బిల్లుతో సహా మరోనాలుగు బిల్లులపై శాసనసభలో చర్చించి ఆమోదం తెలుపవలసి ఉండగా, ప్రత్యేక హోదాపై చర్చ జరపాలని పట్టుబడుతూ వైకాపా సభని స్తంభింపజేసింది. వైకాపా సభ్యులు స్పీకర్ పోడియం వద్దకి వెళ్లి సభా కార్యక్రమాలకి అడ్డుపడ్డారు. సభని రెండు సార్లు వాయిదా వేసినప్పటికీ వైకాపా సభ్యులు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ గందరగోళ పరిస్థితుల మధ్యే ముఖ్యమంత్రి జి.ఎస్.టి.బిల్లుని ప్రవేశ పెట్టారు. దానితో బాటే మరో నాలుగు బిల్లులు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. జి.ఎస్.టి.బిల్లుకి తప్ప మిగిలిన వాటిని ఆమోదించి శాసనసభని స్పీకర్ రేపటి వాయిదా వేశారు.
ఆ సందర్భంగా యధాప్రకారం తెదేపా-వైకాపా సభ్యుల మధ్య తీవ్ర వాదోపవదాలు సాగాయి. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జి.ఎస్.టి.బిల్లుకి అడ్డుపడుతునందుకు భాజపా ఎమ్మెల్యే విశ్నుకుమార్ రాజు వైకాపా సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ పదేపదే తన మైక్ కట్ చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజానికి ఈరోజు ఓటుకి నోటు కేసు, ప్రత్యేక హోదా అంశంపై సభలో చర్చకి పట్టుబట్టాలని వైకాపా భావించినప్పటికీ, నిన్న రాత్రి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజిపై ప్రకటన చేయడం వలన నేడు సభలో అధికార ప్రతిపక్షాల మధ్య ప్రత్యేక హోదా అంశంపైనే యుద్ధం జరిగింది. బహుశః రేపు, ఎల్లుండి కూడా ప్రత్యేక హోదా అంశంపైనే చర్చకి వైకాపా పట్టుబట్టవచ్చు. ఆ కారణంగా సభలో మళ్ళీ రభస జరగడం ఖాయం. ఆ గందరగోళంలోనే శాసనసభ సమావేశాలు ముగిసిపోవడం కూడా ఖాయమే. రాయలసీమలో కరువు పరిస్థితులు, ఇతర సమస్యలపై చర్చలు జరుగుతాయనే నమ్మకం లేదు. ఈ మూడు రోజుల సమావేశంలో జి.ఎస్.టి.బిల్లుకి మాత్రం ఖచ్చితంగా ఆమోదముద్ర పడుతుందని చెప్పవచ్చు. సభలో ఇటువంటి వాతావరణం నెలకొని ఉన్నప్పుడు మూడు రోజులు సమావేశాలు నిర్వహించినా ముప్పై రోజులు నిర్వహించినా ఏమీ ప్రయోజనం ఉండదు.