ఏపీ సచివాలయంలో “లాబీయింగ్ డే..”..!

ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి.. ఈ రోజు..సందర్శకులు పోటెత్తారు. సందర్శకులంటే… స్పందన కార్యక్రమంలో భాగంగా… తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన సామాన్య జనం కాదు. సందర్శకులంటే ప్రభుత్వ ఉద్యోగులే. అయితే.. సెక్రటేరియట్‌లో పని చేసేవారు మాత్రం కాదు. వివిధ జిల్లాల్లో పని చేస్తున్న నేతలు… తమకు ఉన్న కార్లతో.. సచివాలయానికి పోటెత్తారు. ఎంతగా.. అంటే… వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లే రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. గవర్నమెంట్ వెహికల్స్ అన్న స్టిక్కర్లు వేసినవి కొన్ని… ఉద్యోగుల ప్రైవేటు కార్లు ఎన్నో… సచివాలయం ఎదుట నిలబడిపోయాయి. అక్కడ సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత.. ఒక్క సారిగా ఇంత మంది రాలేదు. కానీ ఇప్పుడొచ్చారు. ఎందుకంటే… వీరంతా.. ప్రజా సమస్యలు తీర్చడంలో తలమునకలై… రాలేదు.

ఉద్యోగులంతా తమ సమస్యను పరిష్కరించుకోవడానికి లాబీయింగ్ చేసుకోవడానికి వచ్చారు. ఆ సమస్యే బదిలీ. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… తమకు ఉన్న పరిచయాలతో.. మంత్రులను ప్రసన్నం చేసుకుని.. కావాల్సిన దగ్గరకు పోస్టింగ్ ఇప్పించుకోవడానికి … ఉద్యోగులంతా.. సెక్రటేరియట్‌కు పరుగులు పెట్టారు. ఫలితంగా.. సెక్రటేరియట్ ఒక్క సారిగా బ్లాక్ అయిపోయింది. గతంలో చాలా సందర్భాల్లో… జనం వచ్చిన సందర్భాలు ఉన్నాయి….కానీ ఇలా బదిలీల లాబీయింగ్ కోసం.. ఉద్యోగులు వెల్లువలా వచ్చిన సందర్భాలు లేవని.. నోరెళ్లబెట్టడం…ఇతరుల వంతయింది. ప్రభుత్వం మారింది.. విధానాలు కూడా మారాయి. దానికి తగ్గట్లుగా.. ఉద్యోగులు కూడా.. ప్రభుత్వ విధానాలకు తగ్గట్లుగానే.. తమ తమ పనులు చక్క బెట్టేందుకు ప్రయత్నించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

నిజానికి ఉద్యోగుల బదిలీలతో.. రాజకీయ ప్రమేయం ఉండదు. రాజకీయ నేతలు కూడా అదే చెబుతారు. కానీ ఏపీ సెక్రటేరియట్‌లో మాత్రం.. ఈ రోజు జరిగింది బహిరంగ రహస్యం. రేపు మంత్రులు.. అసలు ఉద్యోగుల బదిలీలతో తమకు సంబధం లేదని ప్రకటిస్తారు. అది జనం నమ్మాలి కూడా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.