ప్రత్యేక హోదా- తెదేపా, భాజపాలకి ఒక శాపం. ప్రతిపక్షాలకి ఒక గొప్ప వరం..గొప్ప ఆయుధం. ఈ ప్రత్యేక రాజకీయ చదరంగంలో తెదేపా, భాజపాలు రెండూ మొదటి నుంచి ఆత్మరక్షణ చేసుకొంటూనే ఆట సాగిస్తుంటే, పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటమన్నట్లుగా ప్రతిపక్షాలు చాల వినోదంగా వాటితో ఆడుకొంటున్నాయి. ఈ ప్రత్యేక రాజకీయ చదరంగంలో మొదటి నుంచి ప్రతిపక్షాలదే పైచెయ్యిగా కనిపిస్తున్నప్పటికీ అవి విజయం సాధించలేకపోవడం, సాధించాలని కోరుకోకపోవడం మరో విశేషం. ఆట ఇంత రసవత్తరంగా సాగుతున్నప్పుడు, దాని వలన తమకి ఇంత ఆనందం, రాజకీయ ప్రయోజనం కలుగుతున్నప్పుడు అది ముగిసిపోవాలని, తామే విజయం సాధించాలని అవీ కోరుకోవడం లేదు. అందుకే నేటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు.
ప్రత్యేక హోదా సంజీవిని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం చాలా తప్పే. ఎందుకంటే అదే జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీని సంజీవిని మూలికలా బ్రతికించి ఉంచుతోంది. ఎంతో కొంత బలం కూడా సమకూరుస్తోంది. వైకాపాకి ఇదొక తిరుగులేని బ్రహ్మాస్త్రంగా మారింది. దానిని కేంద్రప్రభుత్వం మీదనో లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వవలసిన ప్రధాని నరేంద్ర మోడీ మీదనో ప్రయోగించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాత్రమే ప్రయోగిస్తూ లొంగదీసుకొనే ప్రయత్నాలు చేస్తుంటుంది.
ప్రత్యేక హోదా అంశం కొంతమంది స్పెషలిస్టులకి కూడా జన్మనిచ్చింది. ఒకప్పుడు ఏ గుర్తింపుకి నోచుకొని వారిని ఇప్పుడు టీవీ చాన్నాళ్ళు పిలిచి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. వారికి చర్చలలో పెద్దపీట వేస్తున్నాయి. ప్రత్యేక హోదా గురించి, దాని కోసం పోరాడుతున్న వారి గురించి ఈవిధంగా వ్రాసినందుకు చాలా మందికి ఆగ్రహం కలుగవచ్చు కానీ దాని కోసం పోరాడుతున్న ఒక్కొక్క పార్టీని, నేతని వేరుచేసి వారి తీరుని, మాటల పరమార్ధాన్ని నిశితంగా పరిశీలించి చూసినట్లయితే ఈ అభిప్రాయలలో ఎంతో కొంత నిజముందని అర్ధం అవుతుంది.
ఉదాహరణకి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని తీసుకొన్నట్లయితే, రాష్ట్ర విభజన సమయంలో ఆయన రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేకపోయినప్పటికీ, పదవీ, అధికారం కోల్పోయి, కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారిన తరువాత ఇప్పుడు రాష్ట్రం గురించి ఆయన చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నారు.
అయితే అదంతా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసమేనని అందరికీ తెలుసు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ గతి పట్టబోతుందని కాంగ్రెస్ అధిష్టానం ముందే పసిగట్టి, దానిని కాపాడుకోవడం కోసమే ఈ ప్రత్యేక ఆయుధాన్ని తయారుచేసి ఆయన చేతికి అందించినట్లు అనుమానం కలుగుతోంది. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆయన ఆ ఆయుధంతోనే కాంగ్రెస్ పార్టీకి పహారా కాస్తున్నారు. దానిపై ఎవరూ దాడి చేయడం లేదు కానీ లోపల ఉన్నవారే ఒకరొకరుగా మెల్లగా బయటకి జారుకొంటున్నారు. అయినప్పటికీ రఘువీరుడు డీలా పడిపోకుండా తన ప్రత్యేక పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. కోటి సంతకాలు, మట్టి సత్యాగ్రహం, ఛలో డిల్లీ అంటూ రకరకాల పేర్లతో హడావుడి చేసిన ఆయన త్వరలో ‘ప్రత్యేక బ్యాలెట్’ ఐడియాతో జనం ముందుకు రాబోతున్నారు. ఆ ఐడియా కాంగ్రెస్ పార్టీ జీవితాన్ని మార్చదని అందరికీ తెలుసు. ఆయనకి తెలుసు. అయినా తప్పదు.