సినిమా కథ, హీరో గెటప్, హీరోయిన్ లుక్… ఇవన్నీ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, చిత్ర బృందం బయట పెట్టేంత వరకో బయటకు రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. అత్తారింటికి దారేది సినిమాతో లీకేజీ ల విషయంలో చిత్ర సీమ ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్ధమయ్యింది. దర్శక నిర్మాతలు ఎంత జాగ్రత్తగా వున్నా ఫోటోలు, వీడియో ఫుటేజీ ఏదోలా బయటకి వచ్చేస్తోంది. తాజాగా బాలయ్య 100 వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సెట్లో ని ఫోటోలు బయటకి వచ్చాయి. రెజల్యూషన్ తక్కువగా వున్నా సరే… వాటితో ఈ సినిమాలో బాలయ్య లుక్ ఎలా వుండబోతొంది అనేది తెలిసిపోయింది. పనిలో పనిగా శ్రీయా లుక్ కూడా అనఫీషియల్ గా బయటకి వచ్చేసినట్టు అయ్యింది.
ఈ దసరా పండక్కి బాలయ్య, శ్రీయ ల లుక్ విడుదల చేద్దాం అనుకుంది చిత్ర బృందం. కానీ ఇలా లీకేజీ ల రూపం లో నెట్ ప్రపంచం లో సందడి చెయ్యడం మొదలైపోయింది. ఈ ఫోటోలు ఎవరు తీస్తున్నారు, మీడియా కి ఎవరు ఇస్తున్న్నారు అనే విషయంలో బాలయ్య ఆరా తీస్తున్నాడట. సెట్స్ లో సెల్ ఫోన్లు వాడకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రోజు స్టిల్స్ వచ్చాయి.. రేపు వీడియో ఫుటేజీ బయటకి వస్తే పరిస్థితి ఏంటి ? అని చిత్ర బృందం కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. గౌతమీ పుత్ర సెట్స్ లో సెల్ ఫోన్స్ నిషేధించడం ఒకటే మార్గమని బాలయ్య సూచించినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.