రాష్ట్రం మొత్తం మీద గత అయిదేళ్లలో బాగా వివాదాస్పదమైన ఎమ్మెల్యే ఎవరంటే తడుముకోకుండా ఎవరైనా చెప్పే సమాధానం ఒక్కటే చింతమనేని ప్రభాకర్. దెందులూరు ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వో వనజాక్షి పై దాడి చేసినప్పుడు, చంద్రబాబు ఫోటో లేదని ఆర్టిసి బస్సు డ్రైవర్ మీద దాడి చేసినప్పుడు, ఒక దివ్యాంగుడి వృద్ధ తల్లిదండ్రుల పై దాడి చేసినప్పుడు ఇలా రకరకాల సంఘటనల్లో చాలా చాలా విమర్శలు వచ్చాయి. అయితే చింతమనేనికి వ్యతిరేకంగా జగన్ తన పాదయాత్ర సందర్భంగా గట్టిగా కౌంటర్ కి ఇస్తాడు అనుకుంటే, జగన్ తూతూ మంత్రంగా చంద్రబాబుపై విమర్శలు చేసి తన పాదయాత్రను కొనసాగిస్తూ వెళ్లిపోయాడు. అయితే గత ఏడాది సెప్టెంబర్లో పశ్చిమగోదావరి ప్రజాపోరాట యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ చింతమనేని పై తీవ్రంగా విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి పర్యటన ఆద్యంతం చింతమనేని ని తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో తన మీద ఎవరిని పోటీకి నిలుపుతాడు అని అప్పట్లో చర్చ కూడా జరిగింది. అయితే పవన్కళ్యాణ్ నిన్న ప్రకటించిన రెండవ లిస్టులో ఘంటసాల వెంకట లక్ష్మి అనే ఒక బీసీ మహిళకు దెందులూరు టికెట్ కేటాయించాడు. దీంతో ఆవిడ ఎవరు ? పవన్ కళ్యాణ్ ఎందుకని ఆవిడకు టికెట్ కేటాయించాడు, దీని వెనకున్న వ్యూహం ఏమిటి అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Click here for పవన్ సభ కి వెళ్తే 50 వేల జరిమానా, గ్రామపెద్దల తీర్మానం
ఆవిడ ఎవరు అని తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న సంఘటనను గుర్తు చేసుకోవాలి. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ కొల్లేరు సమస్యపై సభ పెట్టడానికి వెళ్లాల్సి ఉండగా గ్రామ పెద్దలు పవన్ కళ్యాణ్ సభ కు వెళితే 50 వేల రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులను భయ పెట్టినట్టుగా అన్ని మీడియా ఛానల్స్ లో వార్తలు వచ్చాయి. ఒకానొక సమయం లో జనసేన కార్యకర్తలు కూడా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అయితే కొల్లేరు ప్రాంత సమస్యలపై ఎప్పటినుండో పోరాడుతున్న కార్యకర్తలు ప్రాంతానికి చేరుకొని ఆ సభను సజావుగా నిర్వహింపజేశారు. పైగా సభకు జనం కూడా భారీగా హాజరయ్యారు. ఇప్పుడు ఈ సంఘటన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గంటసాల వెంకటలక్ష్మి, కొల్లేరు ప్రాంత సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. జాతీయ మత్యకారుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ విభాగానికి అధ్యక్షురాలు అయిన ఆవిడ 2014 ఎన్నికల ప్రచారం సమయంలోనే చంద్రబాబు ,మోడీ ,పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఏర్పాటు చేసిన సభ వద్దకు వెళ్లి ఆ ప్రాంత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచి ఈ ప్రాంతంలో రైతుల ని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది అంటూ పలు సభలలో మాట్లాడారు. అలాగే గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు సమస్య మీద పోరాటం చేస్తున్న సంఘాలకి మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. మొత్తంగా చూస్తే పశ్చిమగోదావరి జిల్లాలోని మత్స్యకారుల సమస్యల మీద, కొల్లేరు ప్రాంత రైతుల సమస్యల మీద చాలా కాలంగా పోరాటం చేస్తున్న ఈవిడకు పవన్ కళ్యాణ్ దెందులూరు టికెట్ కేటాయించటం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
పైగా రాజకీయ సమీకరణాల పరంగా చూసుకున్నా, ఇటు చింతమనేని ప్రభాకర్ అటు వైయస్సార్ సిపి తరపున పోటీ చేస్తున్న అబ్బాయి చౌదరి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. బీసీ ల జనాభా మిగతా వారికంటే ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఘంటసాల వెంకటలక్ష్మి , సామాజిక సమీకరణాల ఆధారంగా చూసుకున్నా కూడా మిగతా ఇద్దరు అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పైగా చింతమనేని ప్రభాకర్ ఆగడాల మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, గతంలో ఎన్నారై కూడా అయిన అబ్బాయి చౌదరి ధీటుగా స్పందించలేదు అన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. ఈ లెక్కన బీసీల జనాభా తో పాటు కాపు జనాభా కూడా బాగానే ఉన్న ఈ నియోజకవర్గంలో ఘంటసాల వెంకటలక్ష్మి కి, చింతమనేని ప్రభాకర్ కి మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.