సంక్రాంతి స్పెషల్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి ఆంధ్రాలో కోడి పందేలు! కోడి పందెం తప్పు అని పోలీసులు చెబుతున్నా, వివిధ స్వచ్ఛంద సంస్థలు పోరాటాలు చేస్తున్నా కూడా పండుగ మూడు రోజులూ మాత్రం పందేలు జోరుగానే సాగుతాయి. చిన్నా పెద్దా అని తేడాలు లేకుండా కోళ్ల పందేల కోసం పరుగులు తీస్తుంటారు. ఈ సందడిలో కోట్ల రూపాయాలు చేతులు మారుతూ ఉంటాయని ప్రతీయేటా కథనాలు వింటూ ఉంటాం. అయితే, ఈ ఏడాది కోడి పందేల జోరు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే, ఈసారి విదేశాల నుంచి కోడి పుంజులు వస్తున్నాయట!
మామూలుగా అయితే, పందెం కోడి పుంజుల్ని ప్రత్యేకంగా పెంచుతూ ఉంటారు. స్థానికంగానే వాటిని పెంచేవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే, ఈ ఏడాది పందెం రాయుళ్లు కాస్త అప్డేట్ అయ్యారట. బలమైన కోడి పుంజుల కోసం ఇంటర్నెట్లో సెర్చింగులు బాగా చేస్తున్నారట. కత్తి కట్టి పందెంలోకి వదిలితే రెచ్చిపోయే వేగంతో దూసుకెళ్లగల కోళ్ల కోసం అన్వేషిస్తున్నారట. ఈ అన్వేషణలో భాగంగా తైవాన్, మెక్సికో, సౌతాఫ్రికా ప్రాంతాల్లో మాంచి బలమైన పుంజులు ఉన్నట్టు తెలుసుకున్నారు. అక్కడ కూడా మన మాదిరిగానే కోడి పందేలు జరుగుతూ ఉంటాయట. మొత్తానికి, బాగా రీసెర్చ్ చేసి, కొంతమంది ఇప్పటికే విదేశీ పందెం పుంజుల్ని తెప్పించుకున్నారని తెలుస్తోంది!
ఒక్కో పుంజూ దాదాపు రూ. పదివేల నుంచి లక్షకు పైమాటే అని చెబుతున్నారు. వీటని బాగా చూసుకునేందుకూ దగ్గరుండి తిండీ నీరూ పెట్టేందుకు మనుషుల్ని నియమించి మరీ పెంచుతున్నారట. ఈ వార్త ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా వినిపిస్తోంది. వచ్చే నెలలో జరిగే సంక్రాంతి కోడి పందేలకు విదేశాల పుంజులు వస్తున్నాయంటూ ముమ్మరంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు.
అయితే, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ ఏడాది పందేల్లో డబ్బు గతంలో మారిదిగా ప్రవహిస్తుందా..? లేదా, ఇక్కడ కూడా నగదు రహిత బెట్టింగులు ఉంటాయేమో వేచి చూడాలి..? మొత్తానికి, ఎంత వద్దనుకుంటున్నా కోడిపందేలు ప్రతీయేటా దినదిన ప్రవర్థమానమౌతూనే ఉన్నాయి. విదేశీ పుంజులను దిగుమతి చేసుకునే స్థాయికి పందేలు వెళ్తున్నాయంటే.. ఎంత అభివృధ్దో చూడండి!