మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారనేది ఇప్పటికీ స్పష్టంగా ప్రకటించలేదు. నిజానికి, ఆయన రెండ్రోజుల కిందటే ప్రతిపక్ష పార్టీ వైకాపాలో చేరిపోవాల్సి ఉంది. భాజపా అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో తనకు ప్రాధాన్యత లభించకపోవడంతో కన్నా తీవ్ర అసంతృప్తికి గురయ్యారని వార్తలొచ్చాయి. పార్టీలో చేరిన దగ్గర నుంచీ సీనియర్ అయిన తనకు పెద్దగా గుర్తింపు లేదన్న కారణమూ ఉందని అన్నారు. అయితే, ఆయన వైకాపాలోకి వెళ్లడం దాదాపు ఖరారు అయిపోయింది. కన్నాతోపాటు ఆయన కుమారుడు నాగరాజుకు కూడా వైకాపా సీట్లు ఇచ్చేందుకు సంసిద్ధం వ్యక్తం చేసిందన్నారు. దీంతో గుంటూరు నగరంలో ఫ్లెక్సీలూ బ్యానర్లూ కూడా వచ్చేశాయి. వైకాపా శ్రేణులు కూడా కన్నాకు ఆహ్వానం పలికేందుకు సిద్ధపడ్డారు. అయితే, చివరి నిమిషంలో ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
ఇక్కడి నుంచి రకరకాల ఊహాగానాలు తెరమీదికి వస్తున్నాయి. ఆయన్ని భాజపా ఆపిందనీ, రామ్ మాధవ్ మాట్లాడరని కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న మరో గుసగుస ఏంటంటే… తెలుగుదేశం పార్టీ ఇచ్చి ఆఫర్ తో కన్నా డైలమాలో పడ్డారనీ, వెంటనే ఏదీ తేల్చుకోలేక తీవ్ర ఒత్తిడికి గురై అలా ఆసుపత్రి పాలయ్యారని వినిపిస్తోంది. వైకాపా ఆఫర్ చేసినట్టుగానే గుంటూరు పశ్చిమ సీటును కన్నాకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమట! ప్రస్తుతం ఆ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కూడా టీడీపీ మాట్లాడేసిందట! వచ్చే ఎన్నికల్లో ఆయనకి మాచర్ల నియోజక వర్గం నుంచీ టిక్కెట్ ఇచ్చేందుకు ఒప్పించినట్టు సమాచారం.
అంతేకాదు, ఇదే సమయంలో ఎమ్మెల్యే మోదుగుల కూడా తన అనుచరులూ అభిమానులతో హుటాహుటిన సమావేశమయ్యారనీ, నియోజక వర్గ మార్పు విషయమై చర్చించారనీ, అందరూ సమ్మతంగా ఉన్నారని వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కన్నాను పార్టీలోకి ఆహ్వానించడం మంచి ఎత్తుగడే అవుతుందనేది ఆ పార్టీ వర్గాల వ్యూహంగా తెలుస్తోంది. సో… కన్నాను పార్టీలోకి పిలిచే రేసులో టీడీపీ కూడా ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇంతకీ, ఆయన ఎటువైపు మొగ్గుతారో వేచి చూడాలి.