ఏపికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటన తరువాత పవన్ కళ్యాణ్ కాకినాడలో సభ పెట్టి భాజపాని తప్పు పట్టడం, ఆ మరునాడే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా కోసం బంద్ పాటించడంతో భాజపా అప్రమత్తమయ్యి తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ముందుగా రాష్ట్ర భాజపా నేతల చేత పవన్ కళ్యాణ్, ప్రతిపక్షాలపై విమర్శలు చేయించింది. తరువాత వెంకయ్య నాయుడు స్వయంగా ఏపికి ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజి గురించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక ప్యాకేజి పట్ల సంతృప్తి వ్యక్తం చేసి ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెప్పుకోవడం బహుశః ఆ ప్రయత్నాలలో భాగమే అయ్యుండవచ్చు.
త్వరలో రాష్ట్రంలో విశాఖ, విజయవాడ లేదా గుంటూరు, తిరుపతిలో భాజపా మూడు బహిరంగ సభలు నిర్వహించి, వాటికి కేంద్రమంత్రులని కూడా ఆహ్వానించి వారి చేతే ప్రత్యేక ప్యాకేజి ద్వారా రాష్ట్రానికి ఏమేమి అందించబోతున్నారో వివరించి ప్రజలలో అపోహలు దూరం చేయాలని భాజపా నిశ్చయించుకొంది. త్వరలోనే ఈ మూడు బహిరంగ సభలో తేదీలు ఖరారు అవుతాయి. ఇక నుంచి రాష్ట్ర భాజపా నేతలు కూడా ప్రత్యేక ప్యాకేజి గురించి గట్టిగా ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. విశాఖలో జరుగబోయే భాజపా సభకి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరవుతారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునాథ బాబు చెప్పారు. ఏపితో సహా దేశంలో మరే రాష్ట్రానికి కూడా ఇక ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.
తెదేపా తరపున రాజ్యసభకి వెళ్ళిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయకుండా నగరంలో కాలు పెట్టగలరా? పెడితే ఏమవుతుంది? అని ఆలోచిస్తే భాజపా పట్ల ప్రజలలో ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని అర్ధం అవుతుంది. అంటే కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక కూడా ఊడినట్లవుతుంది. అందుకే అరుణ్ జైట్లీ విశాఖ సభకి హాజరవుతున్నరేమో? తద్వారా విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని భాజపా స్వయంగా దృవీకరించుకొన్నట్లవుతుంది.
కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని ప్రకటించింది కానీ అదేమీ ఇప్పుడే మూటలు కట్టి ఇచ్చేయడం లేదు. రాగల ఐదేళ్ళలో వాటిని అమలుచేస్తుందని ప్రధాని నరేంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ‘హామీ’ ఇచ్చినట్లు ఆయన స్వయంగా చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ‘హామీ’ అనే మాట వింటే మండి పడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేనప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ కొత్తగా ఐదేళ్ళలో అమలుచేయబోయే వాటికి ఇచ్చిన హామీని ఎవరూ నమ్మరు. ఒకవేళ కేంద్రప్రభుత్వం నిజంగానే ఆ హామీలని అమలుచేయదలచుకొన్నా ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్న ప్రజలు వాటిని నమ్మబోరు. ఎందుకంటే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే హామీలపై నమ్మకం కోల్పోయారు. ప్రత్యేక ప్యాకేజికి చట్ట బద్దత కల్పించమని ముఖ్యమంత్రి కేంద్రప్రభుత్వాన్ని కోరారంటేనే దానర్ధం ఆయన కూడా ఆ హామీలని నమ్మడం లేదని. మరి అటువంటప్పుడు ప్రజలు వాటిని ఏవిధంగా నమ్ముతారు? తమపట్ల నమ్మకం కోల్పోయిన ప్రజలకి భాజపా ఏవిధంగా నమ్మకం కలిగించగలనని భావిస్తోంది? నేటికీ కొన్ని విషయాలలో కేంద్రప్రభుత్వం ఈవిధంగా గుంభనంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆ పార్టీ పట్ల ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతని దూరం చేయగలదా? అంటే అనుమానమే.