బిజెపి అగ్రనాయకత్వం వైఖరి తెలుగురాష్ట్రాల్లో ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు. హైకమాండ్ కు ఆంధ్రప్రదేశ్ శాఖ తలనొప్పిగా మారిపోగా, హైకమాండే తెలంగాణా శాఖకు తలనోప్పిగా మిగిలింది.
తెలుగుదేశంతో ఎపిలో, కేంద్రంలో అధికారం పంచుకున్న బిజెపి తన ఆంధ్రప్రదేశ్ శాఖ వైఖరి ఎలావుండాలో తేల్చుకోలేని సమస్య ఆపార్టీ హైకమాండ్ ను కూడా తలపట్టుకునేలా చేసింది. తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకుంటేతప్ప తాము బలపడి నిలదొక్కుకోలేమని ఒక వర్గం భావిస్తూండగా ప్రస్తుత స్ధితిలో తెలుగుదేశానికి దూరమైతే పార్టీ నిలదొక్కుకోవడమే కష్టమన్నది మరో వర్గం వాదన. ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రత్యేకహోదా రాదని బిజెపినాయకుడైన రాష్ట్ర దేవాదాయమంత్రి మాణిక్యాలరావు, తనభార్యకూడా ప్రత్యేక హోదానే కోరుతున్నదని బిజెపి ఎమ్మెల్యే విష్ణురాజు బహిరంగంగా వ్యాఖ్యానించడం ఆపార్టీ రాష్ట్రశాఖలో బేదాభిప్రాయాలను బయటపెడుతున్నాయి.
బిజెపి నియమావళి ప్రకారం ఒక రాష్ట్రంలో సగం జిల్లాల్లో పార్టీ ఎన్నికలు పూర్తయితే ఆ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు నిర్వహించవచ్చు. జాతీయ అధ్యక్షునిగా అమిత్ షా రెండోసారి ఎన్నికయ్యేనాటికే పదమూడు జిల్లాల ఎపిలో పది జిల్లాల పార్టీ అధ్యక్షుల ఎన్నికలు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా పార్టీ ఎన్నికలే పూర్తికాని తెలంగాణాకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుని నియామకం చేయగలిగిన బిజెపి, అన్ని విధాలా లాంఛనాలు పూర్తి చేసిన ఎపి పార్టీ అధ్యక్ష నియామకంలో జుట్టుపీక్కుంటోంది. తెలుగుదేశంతో సంబంధాలు ఎలావుండాలో తేల్చుకోలేకపోవడమే ఈ ప్రతిష్టంభనకు మూలంగా కనిపిస్తోంది. అధ్యక్ష నియామకంలో నిరవధికమైన జాప్యం పార్టీ కేడర్ మొరేల్ ను దెబ్బతీస్తోంది.
పార్టీ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణాలోనే హెచ్చు అవకాశాలు వున్నాయి. అదీకాకుండా టిఆర్ఎస్ కి బిజెపికి మధ్య మైత్రీబంధమేదీ లేదు. బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నివాసి. పార్టీ బలోపేతానికి ఇన్ని సానుకూలతలు వుండగా కేంద్రనాయకత్వం తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్రప్రభుత్వానికే అగ్రతాంబూలమిచ్చి రాజకీయంగా పలుకుబడి పెంచుకోడానికి టిఆర్ఎస్ కు అవకాశమిస్తోందని బిజెపి తెలంగాణా శాఖలో స్ధూలంగా వున్న భావన.
అధికారంలో వున్న కెసిఆర్ తమకు లాభించే ఏఅంశాన్నైనా హైజాక్ చేస్తారు. ఇచ్చిపుచ్చుకునే గౌరవమర్యాదలు,ప్రోటోకాల్ నియమాలు సరే! ఎన్నికైన బిజెపి ప్రజాప్రతినిధులను వెనక్కి నెట్టేస్తే సహించడమెలా అన్నదే వారి ప్రశ్న! విమానందిగిన వెంటనే కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నేరుగా కెసిఆర్ నివాసానికి వెళ్ళడం వారికి మింగుడు పడలేదు. ప్రధాని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఒక వేడుక మాదిరి నిర్వహిస్తు న్న ప్రధాని కార్యక్రమాన్ని కాదనలేరు. అదేసమయంలో తమను బైపాస్ చేసి బిజెపి డిల్లీ నాయకులతో నేరుగా కెసిఆర్ సంబంధాలు పెట్టుకోవడాన్ని అంగీకరించలేని అవస్ధ.