కర్ణాటక ఎన్నికల్లో ప్రచారపర్వం ముగిసింది. ప్రచారం చివరి రోజున భాజపాపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక, చివరి ప్రెస్ మీట్ లో భాజపా అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ… దాదాపు 130 స్థానాల్లో తాము విజయం సాధిస్తామనీ, ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. గడచిన రెండు రోజుల్లో భాజపా బూత్ స్థాయి కమిటీలు క్రియాశీలంగా పనిచేశాయనే అభిప్రాయం చివరిరోజు ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమైంది. భాజపా, ఆర్.ఎస్.ఎస్. భావజాలం కర్ణాటకకు సరిపోదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లామని కాంగ్రెస్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.
అయితే, కర్ణాటక ఎన్నికల్లో అత్యంత కీలకం కాబోతున్నారనే తెలుగు ఓటర్లను కుల ప్రాతిపదిక విభజించడంలో భాజపా కొంత సక్సెస్ అయిందనే అభిప్రాయం ప్రచారం చివరిరోజున వ్యక్తమౌతూ ఉండటం విశేషం! నిజానికి, ఆంధ్రాకు భాజపా అన్యాయం చేసిందనీ, కాబట్టి కన్నడనాట స్థిరపడ్డ తెలుగువారు భాజపాకి వ్యతిరేకంగా ఓటేస్తారనే నమ్మకం మొదట్నుంచీ ఏర్పడిందే. ఒక దశలో భాజపాని కాస్త భయపెట్టిన అంశం కూడా ఇదే. దానికి అనుగుణంగా ఏపీ అధికార పార్టీ టీడీపీ కూడా కర్ణాటకలో ప్రచారం చేసి వచ్చింది. ఏపీపై భాజపా నిర్లక్ష్యం అనేది అక్కడి తెలుగువారిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే అంతా అనుకున్నారు. కానీ, అక్కడి తెలుగువారిలో మొదలైన ఆ ఫీలింగ్ ని, ఎన్నికలకు వచ్చేసరికి కులాలను అడ్డుపెట్టుకుని స్పష్టమైన విభజనను భాజపా తీసుకొచ్చిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రత్యేక హోదా గురించి తెలుగువారు మాట్లాడుతుంటే… కన్నడ రక్షణ వేదికను భాజపా తెరమీదకి తెచ్చింది. కన్నడనాట స్థిరపడ్డవారు ఈ రాష్ట్ర సమస్యల గురించే మాట్లాడాలిగానీ, ఆంధ్రా ప్రత్యేక హోదాతో సంబంధం ఏముందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. దీంతో ప్రత్యేక హోదా గురించిగానీ, ఏపీ ప్రయోజనాల అంశంపైగా అక్కడి తెలుగువారు మరింత బలంగా మాట్లాడేందుకు వీలుకాని పరిస్థితిని భాజపా సృష్టించిందని అంటున్నారు. రాయలసీమకు చెందిన ఒక కీలక సామాజిక వర్గానికి చెందిన నాయకులతో భాజపా నేతలు నిరంతరం చర్చలు జరిపారని సమాచారం. కన్నడలో స్థిరపడ్డ సదరు సామాజిక వర్గమంతా భాజపాకి అనుకూలంగా పనిచెయ్యాలనే అభిప్రాయాన్ని వారు బలంగా తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో, కర్ణాటకలో ఉన్న తెలుగువారంతా భాజపాకి వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పలేని పరిస్థితిని ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.