తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య పెంపు అంశం దాదాపు మరుగున పడిపోయింది. 2019 ఎన్నికల నాటికి అది సాధ్యమయ్యే పని కాదనే ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇంకోపక్క, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడున్న నియోజక వర్గాల సంఖ్యకు అనుగుణంగానే అభ్యర్థులూ ఏర్పాట్లలో పార్టీలు బిజీబిజీగా కసరత్తులు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో నియోజక వర్గాల సంఖ్య పెంపునకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ మళ్లీ కసరత్తు ప్రారంభించడం విశేషం. నియోజక వర్గాల విభజనకు సంబంధించి అభిప్రాయం చెప్పాలంటూ… ఎన్నికల సంఘాన్ని హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఒకవేళ నియోజక వర్గాల సంఖ్య పెంచితే, ఏయే కేటగిరీల కింద రిజర్వుడు నియోజక వర్గాల సంఖ్యను ఎన్నెన్ని పెంచొచ్చు అనే అభిప్రాయం కూడా కోరింది. అంతేకాదు, 2001 జనాభా లెక్కల ప్రకారమే సంఖ్యను పెంచాలంటూ రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన నివేదికను కూడా ఎన్నికల సంఘానికి హోంశాఖ పంపించింది.
నియోజక వర్గాల పెంపుపై వీలైనంత త్వరగా నిర్ణయం చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల సంఘం నివేదిక ఇచ్చిన వెంటనే, దాని ఆధారంగా క్యాబినెట్ నోట్ తయారు చేయాలని, రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే, కేంద్రంలో తాజా కదలిక నేపథ్యంలో కొన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏపీ విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలనూ ముందుగా అమలు చేయడంపై కాకుండా… ఉన్నట్టుండి నియోజక వర్గాల పెంపుపై కదలిక ఎందుకు తెచ్చినట్టు అనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాదు, గతంలో ఇదే అంశమై రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుందనే చర్చ కూడా జరిగింది. రాజకీయంగా కూడా.. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచడం వల్ల భాజపాకి ఏరకంగా చూసుకున్నా ఉపయోగం లేదనే నివేదికలు కూడా భాజపా అధినాయకత్వం దగ్గరకి వచ్చాయనీ గతంలో విశ్లేషణలు వినిపించాయి.
పోనీ, ఇప్పటికిప్పుడు ప్రక్రియ ప్రారంభించినా… రాజ్యాంగ సవరణ మాటేంటి..? శీతాకాల సమావేశాలే భాజపా సర్కారుకి చివరి పార్లమెంటు సమావేశాలు అవుతాయి. ఒకవేళ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే… ఓపక్క ఎన్నికలకు సిద్ధం కావాల్సిన తరుణంలో, నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియను ఎలా చేస్తారు..? ముందుగా ఈ అనుమానాలపై స్పష్టత ఇస్తే తప్ప… తాజాగా హోం మంత్రిత్వ శాఖలో వచ్చిన కదలిక వెనక ఉన్న ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టత రాదు! ఒకటైతే వాస్తవం… తెలుగు రాష్ట్రాలపై భాజపాకి గురి ఉంది. దానికి అనుగుణంగా ఏవో అనూహ్య వ్యూహాలను భాజపా అనుసరిస్తుందనే ఒక అంచనా కూడా ఉంది. మరి, అనూహ్యంగా సీట్ల పెంపు నిర్ణయాన్ని తెరమీదికి తేవడం వెనక ఉద్దేశం ఏంటనేది వేచి చూడాల్సిందే.