అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ ఉదంతాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహాపాపంగా అభివర్ణిస్తూ అసెంబ్లీలో ఆధారాలతో సహా సమగ్ర వివరాలు వెల్లడించారు. దాదాపు 20 కోట్ల కల్తీ లడ్డూలను భక్తులకు పంపిణీ చేసి, కోట్ల మంది హిందువుల విశ్వాసాలతో ఆడుకున్నారని, ఇది కేవలం అవినీతి మాత్రమే కాదని, వ్యవస్థీకృత నేరమని మండిపడ్డారు.
ఐదేళ్లలో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని నిబంధనలకు విరుద్ధంగా సేకరించి, రూ. 231 కోట్లకు దోచేశారని సీఎం లెక్కలతో సహా నిరూపించారు. కేవలం లాభాపేక్షతోనే కాకుండా, హిందూ ధర్మం పట్ల ఉన్న వ్యతిరేకతతోనే ఒక సిండికేట్గా ఏర్పడి ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్డీడీబీ నివేదిక ద్వారా బయటపడిన ఈ వాస్తవాలను గత పాలకులు తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని, ఆ భగవంతుడి సంకల్పం వల్లే ఈ నిజం నేడు బయటపడిందని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రస్తుతం ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సిట్ విచారణ కొనసాగుతోందని, అక్రమార్కులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం లడ్డూ కల్తీ మాత్రమే కాకుండా, గత ఐదేళ్ల టీటీడీ పాలనలో జరిగిన ఇతర అక్రమాలను వెలికితీసేందుకు ఒక ఏకసభ్య కమిటీని నియమించినట్లు సభకు వెల్లడించారు. దోషులకు కఠిన శిక్షలు పడేలా చేసి, తిరుమల పవిత్రతను కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని ఆయన పునరుద్ఘాటించారు.
తిరుమల ఆలయ గౌరవ మర్యాదలను కాపాడేందుకు భవిష్యత్తులో అత్యంత కఠినమైన చట్టాలను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో టీటీడీకి ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తామని, దేవాలయ నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకునేలా నిబంధనలు మారుస్తామని తెలిపారు. ఇలాంటి మహాపాపాలు పునరావృతం కాకుండా అడ్డుకోవడమే కాకుండా, తిరుమలను మళ్లీ ఆధ్యాత్మిక కేంద్రంగా పూర్వవైభవం తీసుకువస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
