హిందూపురం… గతవారమంతా హాట్ హాట్ రాజకీయలకు వేదికగా నిలిచింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత నియోజక వర్గంలో సొంత పార్టీ నేతలే సొంత పీయేకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇంట్లో తేల్చుకోవాల్సిన పంచాయితీని రచ్చకీడ్చారు. ఎట్టకేలకు పీయే శేఖర్ను తొలగించాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు. అంతే… అక్కడితో హిందూపురం తెలుగుదేశంలో హీట్ చల్లారిపోయింది… అనుకుంటే పొరపాటే అవుతుంది! బాలయ్య నియోజక వర్గంలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమస్య సమసిపోయింది కదా… ఇంకా అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏముంది అనేగా మీ ప్రశ్న..? అసలు రాజకీయం ఇక్కడే ఉంది!
అనంతపురంలో బాలయ్య పేరుతో చాలామంది చాలా దందాలు చేస్తున్నట్టు చంద్రబాబు దృష్టికి వచ్చిందట! బెంగళూరు కేంద్రంగా బాలయ్య సొంత మనుషులే చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు సమాచారం. ఇది చాలా సున్నితమైన అంశం. ఎందుకంటే, బాలయ్య సన్నిహితులు, బంధువులపై బాబు నియంత్రణ అనేది చాలా ఇబ్బందికరమైన ఇష్యూ అవుతుంది! ఇప్పటికే, బాలయ్యకు పార్టీలో ప్రముఖ స్థానం దక్కలేదనే అసంతృప్తి కొద్దిమందిలో ఉంది. కర్ర విరగకుండా పామును చంపాల్సిన పరిస్థితి ఇది..! అందుకే, ముందుగా పీయే వ్యవహారాన్ని ఆయనే రాజేసి ఉంటారని కొంతమంది భావిస్తున్నారు. పార్టీ నేతల నుంచే పెద్ద ఎత్తున నిరసన రావడంతో శేఖర్ను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. బాలయ్య కూడా కాదనలేని పరిస్థితి ఏర్పడింది కదా! దీంతో బాలయ్య సన్నిహితులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఓ రకంగా మార్గం సుగమం అయిందని చెప్పుకోవాలి.
అయితే, ఈ తాజా చర్యల ద్వారా చంద్రబాబు ఇవ్వబోతున్న సంకేతాలేంటీ అంటే… సొంత వారైనాసరే, తప్పు చేసినట్టు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ఏమాత్రం వెనకాడరూ అని! ఈ ఇంపాక్ట్ ఇతర నేతలపై కూడా ఉంటుంది. అలా ఉండాలని చంద్రబాబు ఆశిస్తారు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే, కొంతమంది ప్రముఖ నేతల తీరుపై అసంతృప్తి ఉన్నా వారిని కాదనలేకా, అవుననలేక చంద్రబాబు మీన మేషాలు లెక్కిస్తున్న పరిస్థితి పార్టీ ఉంది. దీంతో అనంతపురం వ్యవహారాన్ని ఈ విధంగా మలుచుకుని పేరు తెచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.. అని విశ్లేషిస్తున్నవారూ కొంతమంది ఉన్నారు. మొత్తానికి, హిందూపురంలో ఈ మధ్య చోటుసుకున్న పరిణామాల ఫాలోఅప్ చాలానే ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి, ఇదంతా చంద్రబాబు నడిపిస్తున్న వ్యూహం అనే అనుమానం బాలయ్య వచ్చిందో లేదో..!