కలలు కనండి.. అని అబ్ధుల్ కలాం చెప్పిన ఒక్క మాట చాలా మందికి మరోరకంగా అర్ధమవుతుంటుంది! కలలు కనడం అంటే పొద్దస్తమానం పడుకోవడం కాదని చాలా సందర్భాల్లో సెటైర్లు కూడా పడుతుంటాయి. ఇదే క్రమంలో.. కలలు కనడమే కాకుండా ఆ కలలు తాను మాత్రమే కనగలిగానని, సాధ్యాసాధ్యాలతో ఏమాత్రం సంబందం లేకుండా కూడా… వాటిని వెంటనే, వీలైనంత త్వరగా అమలు చేసేస్తానని చెబుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు! ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతుందట అనే మాటలతో ఉదహరించలేము కానీ… బాబు మాటలు వింటుంటే ఒక్కోసారి అలాంటి సామెతలు కూడా ప్రయోగించాలనిపిస్తుంటుంది. దానికి అవకాశాలు కూడా చాలా బలంగా ఇస్తుంటారు బాబు. అందుకు వేదికైంది తాజాగా జరిగిన భాగస్వామ్య సదస్సు.
గత ఏడాది విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఏపీ సర్కారు సుమారు రూ.5లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకున్నట్లుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇలా చేసుకున్న ఒప్పందాలు గడిచిన ఏడాది ఎన్ని వచ్చాయి? ఎంతమేర పూర్తి అయ్యాయి? అనే విషయాలు ప్రభుత్వ పెద్దలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టొద్దు!! ఈ లెక్కలు అలా ఉంటే… తాజాగా మరో 10.5 లక్షల కోట్ల మేర ఒప్పందాలు చేసేశారు చంద్రబాబు. చేతల సంగతి దేవుడెరుగు, కనీసం పేపర్లో అయినా ఉన్నాయి కదా అని తెగ మురిసిపోతున్నారు ఆశాజీవులు! ఈ సందర్భంగా తాజాగా జరిగిన భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు దావోస్ లాంటి ఒక కలగన్నారు!!
అదేమిటంటే… “ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భవిష్యత్తులో ప్రతీ ఏటా… పారిశ్రామిక, విద్య, కార్పొరేట్, ప్రభుత్వ, మీడియా, సమాజిక మొదలైన రంగాల వారిని ఒకే వేదికపైకి తెచ్చి సదస్సులు నిర్వహిస్తాం”అని! ఎందుకంటే.. దావోస్ లో కూడా ప్రతీ ఏటా ఇలానే జరుగుతుందట! ఇప్పటికే ప్రపంచంలోని బాబు తిరిగి, చూసి, గొప్పవి అని భావించిన అన్ని దేశాల, ప్రాంతాల మాదిరిగా అమరావతిని మార్చుతున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా అచ్చు దావోస్ లో జరిగినట్లే వచ్చే ఏడాది నుంచే సదస్సులు నిర్వహిస్తారట.
అయితే.. ఇక్కడ సామాన్యుడినుంచి ఎదురయ్యే సందేహాలు కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ కలల రాజధాని అమరావతిలో కనీసం రోడ్లు సరిగా లేవు, అసలు (తాత్కాలిక) సెక్రటేరియట్ తప్ప పూర్తయిన మరో పని లేదు!! గ్రాఫిక్స్ లో చూపించిన వాటిలో ఏ ఒక్కటీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు! అమరావతి అంటే గ్రాపిక్స్ రూపంలో మీడియాకు నాలుగు ఫోటోలు రిలీజ్ చేసి భజన చేయించుకోవడమో బాబు అనుకుంటున్నారా? అమరవతిలో ఏర్పాటు చేసిన ఎన్నో శంకుస్థాపన శిలాపలకాల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచేసిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న క్రమంలో ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏమిటి? ఈ క్రమంలో ఆ సంగతులు వదిలేసిన బాబు… ప్రపంచంలో ఆయన ఏది చూసిన, ఏది కలగన్నా… సాధ్యాసాధ్యాలను విస్మరించి ప్రజలను మభ్యపెడుతూ పత్రికల్లో హెడ్డింగులకు పరిమితమయ్యే మాటలు మాట్లాడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఐదేళ్లలో పలనా రకంగా ప్లాన్ చేస్తున్నాం అని చెబితే కనీసం వినడానికైనా సౌకర్యంగా ఉంటుంది కానీ… ఏది చూసినా వచ్చే ఏడాది నుంచి, వెంటనే అనడం.. ఏపీ ప్రజలను వంచించడమే అనేది మరికొందరి వాదన!
మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం అమరావతిలో ఉన్న పరిస్థితులు ఏమిటి? జనం వింటున్నారు కదా, పత్రికలు రాస్తున్నాయి కదా అని ఏదిబడితే అది మాట్లాడితే రేపు అదే జనాలు నవ్వుతారేమో? ఇలాంటి మాటలు చెప్పి మనం ఎవరిని మోసం చేస్తున్నాం? ప్రజలను మోసం చేస్తూ కొన్ని రోజులు పబ్బం గడుపుకుంటున్న క్రమంలో మనలను మనమే మోసం చేసుకుంటున్నామేమో? వంటి ఆలోచనలు పెద్దలకు కలగాలని ప్రజలు కోరుకుంటున్నారు.