ఏపికి ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించడానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సిద్దం అయినపుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ రానంటే రానని విజయవాడలోనే ఉండిపోయి అర్ధరాత్రి వరకు చాలా హైడ్రామా నడిపించారు. చివరికి ఆయన లేకుండానే అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజి ప్రకటన చేసేసి చేతులు దులుపుకొన్నారు. ముఖ్యమంత్రి డిల్లీ వెళ్ళకపోవడం ద్వారా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి పట్ల తాను సంతృప్తి చెందలేదనే స్పష్టమైన సంకేతం కేంద్రానికి, ప్రజలకి పంపించారు.
కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపానని, ప్రత్యేక హోదాకి సమానమైన మొత్తాన్ని ఐదేళ్ళలో ఇస్తామని ప్రధాని చెప్పారని ముఖ్యమంత్రి స్వయంగా ఇప్పుడు ప్రజలకి చెప్పుకొన్నారు. అంటే ప్రత్యేక ప్యాకేజి పట్ల ఆయన సంతృప్తిగానే ఉన్నట్లు అర్ధం అవుతోంది. మరి ఆ రోజు ఆవిధంగా ఎందుకు వ్యవహరించినట్లు? అనే సందేహం కలుగక మానదు.
ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి తీసుకోవడానికి సిద్దపడినందుకు రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నారని ఆయనకీ తెలుసు. బహుశః అందుకే తాను కూడా ప్రత్యేక ప్యాకేజి తీసుకోవడానికి అసలు ఇష్టం లేనట్లుగా వ్యవహరించారు. ఆ తరువాత అయిష్టంగానే తీసుకొంటున్నట్లు మాట్లాడారు. ఇప్పుడు సంతృప్తి చెందినట్లు మాట్లాడుతున్నారు. పైగా అందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు కూడా చెప్పుకొన్నానని ఆయనే స్వయంగా చెప్పుకొంటున్నారు. అంటే ఇదంతా ప్రజలని మభ్యపెట్టడానికేనని అర్ధం అవుతోంది.
ఇప్పుడు ఆయనలో కనిపిస్తున్న మరో మార్పు ఏమిటంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం తగ్గించి పోలవరం ప్రాజెక్టు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ప్రజల దృష్టిని దానిపైకి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. అందుకే పోలవరం ప్రాజెక్టుకి 100 శాతం నిధులు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుకొన్నానని, పోలవరం ప్రాజెక్టు పనులని ఇకపై నిరంతరం పరిశీలిస్తూ రెండేళ్ళలో పూర్తి చేసేందుకు గట్టిగా కృషి చేస్తామని చెప్పారు. అంతే కాదు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకి కూడా వెళ్ళారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు తెదేపా నేతలు అందరూ పోలవరం ప్రాజెక్టు గురించి ఎక్కువగా మాట్లాడుతూ దానివైపు ప్రజలు దృష్టి మళ్ళించే ప్రయత్నాలు చేయబోతున్నారని భావించవచ్చు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే అందరికీ సంతోషమే. కానీ ఒక సమస్య నుంచి ప్రజల దృష్టిని మరో దానిపైకి మళ్ళించే ప్రయత్నమే ఎవరూ హర్షించరు. పోలవరం ప్రాజెక్టు గురించి
ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రైల్వేజోన్ గురించి ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదు? అంటే విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేసే అవకాశం లేదని తెలిసినందునేనని చెప్పక తప్పదు. దానిపై కూడా రేపు ఎప్పుడో ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తే అప్పుడు కూడా ఇలాగే “వైజాగ్ లో ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు…అందుకే విజయవాడలో ఏర్పాటు చేయడానికి అయిష్టంగానే ఒప్పుకోవలసి వచ్చింది..లేకుంటే అదీ మనకి దక్కకుండా పోతుంది,” అని చెపుతారేమో?
ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రాభివృద్ధి జరుగడమే ముఖ్యం. హోదా రాదు..ప్యాకేజీ రాదు.. రాష్ట్రాభివృద్ధి జరుగదు… రైల్వేజోన్ ఏర్పాటు కాదు.. రాజధాని నిర్మాణం కాదు.. కానీ పోలవరం ప్రాజెక్టు చూసి సంతృప్తి పడండి అని చెపితే వచ్చే ఎన్నికలలో ప్రజలు వినే అవకాశం లేదని గ్రహిస్తే మంచిది.