ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరో తేదీన గుంటూరులో రాజకీయ సభ పెట్టేందుకు రానున్న నేపధ్యంలో… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో..ఏపీ పట్ల కేంద్రం వ్యవహరించిన తీరును… ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా.. ఈ రోజు నుంచి రోజుకొకటి చొప్పున శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. తొలి రోజు.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-హామీల అమలుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. విభజన చట్టం హామీలు.. కేంద్రం ఎంత మేరకు అమలు చేసిందనేదానిపై.. పూర్తి వివరాలు ప్రకటించారు.
నాలుగున్నరేళ్లు దాటినా తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన చేయలేదన్నారు. రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరామని.. విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి చేశాము.. అయినా కేంద్రం కావాలనే ఏపీపై కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేకహోదా అడిగినందుకు కక్ష కట్టారని.. మోడీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణానికి మట్టి, నీళ్లు ఇచ్చి మోదీ చేతులు దులిపేసుకున్నారుని అదే సమయంలో పటేల్, శివాజీ విగ్రహానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చారన గుర్తు చేశారు. అమరావతి నిర్మాణానికి మాత్రం నామమాత్రంగా నిధులిచ్చారన్నారు. పోలవరానికి ఇంకా చాలా నిధులు రావాల్సి ఉందని.. ఏపీ భవన్ ఆస్తుల విభజన కూడా జరరగలేదన్నారు. రాష్ట్ర విభజనతో నిరాశలో ఉన్న రాష్ట్ర ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు.
రాజ్యాంగంపై మోదీ ప్రభుత్వానికి నమ్మకం లేదు. 29 సార్లు నేను దిల్లీకి వెళ్లినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపైనా మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా పార్లమెంట్లో ఏపీకి అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు మాట మార్చారని గుర్తు చేశారు. అలాంటి పార్టీకి జగన్, పవన్ మద్దతిస్తారా అని ప్రశ్నించారు. హోదా అనేది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, ఈ విషయంలో ధర్మపోరాటాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. ఆరో తేదీ వరకూ.. శ్వేతపత్రాలు విడుదల చేసి జన్మభూమి సభల్లో ప్రజల ముందు చర్చకు పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.