రజినీకాంత్ రాజకీయాల్లోకి రారని రజినీ సోదరుడు సత్యనారాయణ చెప్పారు. మీడియాకు అదో పెద్ద న్యూస్ అయిపోయింది. అంతకుముందు కూడా ఎప్పుడు ఎన్నికల సంవత్సరం వచ్చినా కూడా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తాడా? రజినీకాంత్ రాజకీయారంగేట్రం ఉంటుందా? అని తెగ రాతలు రాసేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు. కనిపించిన ప్రతివాడిని కూడా… వాళ్ళిద్దరూ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే అధికారంలోకి వస్తారా? రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తారు? లాంటి రొటీన్ కొశ్ఛన్స్ అడిగి విసిగిస్తూ ఉంటారు. మీడియా రాతలను, టివి గొట్టాల ముందు ఆవేశంగా స్పందించిన అభిమానుల మాటలను నమ్ముకునే చిరంజీవి లాంటి వాళ్ళు రాజకీయ అరంగేట్రం చేసి ఓ బ్లాక్ బస్టర్ డిజాస్టర్ ఇచ్చారు.
ముఠామేస్త్రిలాంటి సినిమాల్లో తెరపైన తను పండించిన రీల్ రాజకీయానికి, రియల్ రాజకీయానికి…. తెరపైన హీరోయిజానికి, రియల్ లైఫ్ జీవితానికి ఉన్నంత తేడా ఉందని తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ మరోసారి సినిమా తెరంగేట్రం చేసేశారు చిరంజీవి. ఇక చిరంజీవి సమకాలికుడే అయిన రజినీ మాత్రం కొంచెం తెలివిగా ఆలోచించి తెలివిగా వెనుకడుగేశాడు. చిరంజీవి అనుభవం నుంచి రజినీకాంత్ సరైన పాఠాన్నే నేర్చుకున్నాడు కానీ మీడియా మాత్రం ఇంకా ఏం మారలేదు. దైవభక్తితో దేవుడి దగ్గరకు వచ్చిన రజినీ సోదరుడిని పట్టుకొని జయలలితకు ఆరోగ్యం బాగాలేదు కదా? ఇక రజినీ రాజకీయ తెరంగేట్రం చేసేస్తారా? అని ప్రశ్నలు సంధించారు. ఆయన మాత్రం రజినీకాంత్ రాజకీయాల్లోకి రాడని చెప్పేశారు. కొంతమంది ఆవేశపరులైన అభిమానులను పక్కన పెడితే ఎక్కువ మంది చెప్తుంది కూడా అదే. రాజకీయాల్లోకి రావొద్దనే.
అయినా చిరంజీవి, రజినీకాంత్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఏం మార్పు తీసుకుని వస్తారు? అసలు వాళ్ళకు జీవితాలనిచ్చిన సినిమా పరిశ్రమలలో వాళ్ళు ఎలాంటి మార్పును తీసుకుని వచ్చారు? ఆ విషయం పక్కన పెట్టినా ఇప్పుడు కావేరి జలాల సమస్య రాగానే కమల్ హాసన్ చాలా ధైర్యంగా స్పందించాడు. రజినీకి ఆ గట్స్ ఉన్నాయా? తెలంగాణా రాష్ట్ర ఉద్యమ సమయంలో తన అభిప్రాయం ఏంటో చిరంజీవి స్పష్టంగా చెప్పగలిగే ధైర్యం చేశాడా? ఆవేశపరుడు, ఆలోచనాపరుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ చెప్పగలిగాడా? విభజన పూర్తయ్యాక తీరిగ్గా ప్రజల ముందుకు వచ్చి విభజన సమయంలో తాను ఏమేం మాట్లాడాలనుకున్నాడో అవన్నీ చెప్పేశాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అన్నమాట. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా అందరూ ఫెయిల్ అయ్యాక ఆయన ఎంట్రీ ఉంటుందట. అంటే ఎప్పుడు 2019 ఎన్నికల సమయంలోనా? ఇలాంటి వాళ్ళు ఏధో మార్పు తెస్తారని కొంతమంది చెప్పడం…. మనం నమ్మడం. ఈ సందర్భంలో స్వర్గీయ ఎన్టీఆర్ గురించి ఓ మాట చెప్పుకోవాలి. తెలంగాణా ఉద్యమం కెసీఆర్ కాలంలో కంటే ఇంకా ఉధృతంగా సాగుతూ ఉన్న సమయంలోనే…… సినిమాలో సందర్బం లేకపోయినప్పటికీ… ‘తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది….’ అన్న పాటను ప్రత్యేకంగా రాయించి, సినిమాలో పెట్టించిన ధైర్యం ఎన్టీఆర్ది. ఆ రోజుకి ఇంకా ఆయనకు రాజకీయాల గురించిన ఆలోచన కూడా లేదు. కానీ తెలుగు వాళ్ళ మధ్య ఉన్న విభేదాలను తొలగించాలన్న చిత్తశుద్ధితో తన వంతు ప్రయత్నం చేశారు. తెలుగు వాళ్ళ మధ్య అభిమానం, ప్రేమలను పెంపొందించడం కోసం శక్తివంతమైన మీడియా అయిన సినిమాల ద్వారా తను కూడా ఓ మంచి మాట చెప్పాడు. ఆ ప్రయత్నంలో ఏ మాత్రం తేడా వచ్చి ఉన్నా తెలంగాణా ప్రజలందరికీ దూరమయి ఉండేవాడు ఎన్టీఆర్. ఆ మేరకు ఆయన సినిమాల కలెక్షన్స్ కూడా దెబ్బతిని ఉండేవి. నంబర్ ఒన్ పొజిషన్లో ఉన్న హీరో అలాంటి ధైర్యం చేయడం అంటే మామూలు విషయం కాదు. రజినీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్…..ఇంకా రాజకీయాల్లోకి వస్తారా? రారా? అని మీడియా చర్చిస్తూ ఉన్న స్టార్స్, రాబోయే స్టార్స్ అందరిలో ఓ ఒక్కరికి అయినా ఇలాంటి ధైర్యం ఉందా? ఎంతసేపూ నాలుక మడతేసి మాట్లాడే నైజం, లేకపోతే మౌనంగా ఉంటూ ఎస్కేప్ అయ్యే తెలివితేటలేగా అందరివీనూ. అంతోటి దానికి వీళ్ళు రాజకీయాల్లోకి వస్తారా? రారా? వస్తే ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? లాంటి చర్చలొకటి మళ్ళీ.