కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన సత్ సంప్రదాయాన్ని కొనసాగించారు. దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సంస్కృతినికి ప్రతిబింబిచే కార్యక్రమాలే కాదు, మంచి విందుభోజనం ఏర్పాటు చేయడం దత్తన్న ప్రత్యేకత.
ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ వస్తారని అనుకున్నారు గానీ వాళ్లు రాలేదు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డితో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు నాయకులు హాజరయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తోపాటు కొందరు అధికారులూ హాజరయ్యారు.
దసరా వచ్చిందంటే దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం ఖాయమనే విధంగా ఒక ముద్ర పడింది. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఘుమఘుమలాడే వంటకాలను కొసరి కొసరి వడ్డించడం ద్తతన్న కార్యక్రమ ప్రత్యేకత.
ఈసారి మెనూ చూస్తేనే నోరూరుతుంది. దాదాపు 40 రకాల వంటకాలను వండి వార్చారు. శాకాహారం, మాంసాహరం ఏది కావాలంటే అది రెడీ. తెలంగాణ వంటకాలైన మలిద ముద్దలు, అంబలి, గారెలు సకినాలు, సర్వ పిండి, మక్క గారెలతో పాటు జొన్న రొట్టెలు, సజ్జరొట్టెలు ఇంకా అనేక రకాల పిండివంటలు సిద్ధం చేశారు. శాకాహారంలో రకరకాల వేపుళ్లు, కూరలు రెడీ అయ్యాయి. బగార అంటే బిర్యానీ అన్నంతో పాటు తెల్ల అన్నం కూడా రెడీగా ఉంచారు.
మాంసాహార ప్రియుల కోసం మటన్, చికెన్, బోటీ తదితర వెరైటీలు వండి వడ్డించారు. రొయ్యలు, చేపలు బొమ్మిడాల పులుసు వగైరాలను అతిథులు ఆరగించారు. మానవ సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సంస్కృతిని గుర్తు చేసుకోవడం అనే ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా దత్తాత్రేయ దసరా సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు.