ఐసిస్‌పై దిగ్విజ‌య్ వరస్ట్ ట్వీట్-కెటీఆర్ సూపర్ కౌంటర్…కాంగ్రెస్‌కి బుద్ధిరాలేదంతే

దేశంలో కాంగ్రెస్ పార్టీ ఊసే లేకుండా చేసేలా మోడీ-అమిత్ షాలు రాజకీయ యజ్ఙం చేస్తున్నారు. ఇప్పటి కాంగ్రెస్‌ దుస్థితిని చూసి ఆ పార్టీ హార్డ్ కోర్ అభిమానులు కూడా బాధపడుతున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ నాయకుల తీరు మాత్రం ఏమీ మారలేదు. కాంగ్రెస్ పార్టీ పతనాన్ని సంపూర్ణం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టుగా రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీకి తగ్గట్టుగానే ఆ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. దేశంలో వేరే ఏ సమస్యలు లేనట్టుగా లేని సమస్యలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం అందరి చేతా చీవాట్లు తినడం కాంగ్రెస్‌కి రివాజు అయిపోయింది. అధికారంలో ఉన్న పదేళ్ళలో కాంగ్రెస్ చేసిన మత రాజకీయాల గురించి కొత్తగా చెప్పేదేముంది. మోడీకి బంపర్ మెజారిటీ రావడానికి ప్రధాన కారణం అలాంటి రాజకీయాలే కదా. మైనారిటీ రాజకీయాలతో విసుగొచ్చే కాంగ్రెస్‌ని తిరస్కరించారు ప్రజలు.

అయినప్పటికీ కాంగ్రెస్‌ నాయకుల తీరు మాత్రం మారడం లేదు. మళ్ళీ మళ్ళీ అవే మత రాజకీయాలను, రెచ్చగొట్టే రాజకీయాలను నమ్ముకుని ప్రజల మెప్పు పొందాలని విఫలయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పట్ల సానుభూతి ఉన్న ఒకరిద్దరు కూడా పూర్తిగా కాంగ్రెస్‌ని వ్యతిరేకించేలా చేసుకుంటున్నారు. తన వ్యక్తిగత జీవితంతోనూ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్‌ నాయకులకు ఇచ్చిన సలహాలతోనూ కాంగ్రెస్ పతనంలో తన వంతు పాత్ర పోషించిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు మరోసారి ప్రజలకు కాంగ్రెస్ అంటేనే విరక్తి వచ్చే వ్యాఖ్యలు చేశాడు. కనీస జ్ఙానం లేకుండా ఈ మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆలోచన ఉన్న ప్రజలందరికీ ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి.

‘తెలంగాణా పోలీసులు ఒక బోగస్ ఐసిస్ సైట్ ఏర్పాటు చేసి…ఆ సైట్ ద్వారా ముస్లిం యువకులు ఐసిస్‌లో చేరేలా ఎంకరేజ్ చేస్తున్నారు…..’ ఇవి శ్రీమాన్ దిగ్విజయ్ సింగ్ అనే మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు, సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులందరి చేతా చాలా చాలా గొప్ప నాయకుడు అని బ్రహ్మాండంగా భజన చేయించుకున్న దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు. ఇలాంటి నాయకులకు ఏం శిక్ష వేయాలి? వోడ్కా మత్తులో ట్వీట్స్ వేసే వాళ్ళకంటే ఆ నాయకులు దేశానికి ఇంకా ప్రమాదకరం కాదా? కెటీఆర్ కూడా దిగ్విజయ్‌కి ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి ఇంతటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం అని చెప్పాడు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా కోరాడు. కానీ అలా ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు అవుతారు? కాంగ్రెస్ ఇంతటి పతనావస్థకు ఎందుకు చేరుతుంది? ఇంకా రెచ్చిపోయి మాట్లాడతాడనడంలో సందేహం లేదు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్‌ని పాతాళానికి తొక్కేసేవరకూ ఈ కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉండేలా ఉన్నారు. ఆ శుభముహూర్తం 2019 ఎన్నికలే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దిగ్విజయ్ లాంటి నాయకులను చూస్తూ ఉంటే అది నిజమే అనిపిస్తోంది మరి .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.