తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరి కంటే సీనియర్ అయిన దాసరి నారాయణరావుని ఏదయినా కార్యక్రమానికి అతిధిగా ఆహ్వానించినట్లయితే, ఆయన తప్పకుండా ఎవరి మీదో ఒకరి మీద తనదైన శైలిలో బాంబులు వేస్తుంటారు. నిన్న తెనాలిలో అభ్యుదయ సినీ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ స్మారక పురస్కారాన్ని దాసరి నారాయణ రావు అందుకొన్నారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇప్పుడు సినిమాలకి కధలు అవసరం లేదు…హీరోల డేట్స్ దొరికితే చాలన్నట్లుంది. వారి డేట్స్ దొరికితే మరిక దేనితోను పనిలేదన్నట్లుగా సినిమాలు తీసేస్తున్నారు. కొందరు హీరోలు తమ నోటికి వచ్చినదేదో మాట్లాడితే వాటినే పంచ్ డైలాగులని మురిసిపోతూ సినిమాలలో పెట్టేస్తున్నారు. మనకిప్పుడు కావలసింది పంచ్ డైలాగ్స్ కాదు.. మంచి డైలాగ్స్. మన సినిమాల కోసం శివరామకృష్ణ వ్రాసిన డైలాగ్స్ వింటే నేటికీ అవి మన రాజకీయ నాయకులకు బాణాల్లాగా గుచ్చుకొంటాయి. సినిమాలకి హీరోల డేట్స్ ముఖ్యమే కానీ అంతకంటే సినిమాకి కధ చాలా ముఖ్యం. మన తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవాలంటే మన తీరు మార్చుకోవలసి ఉంది,” అని అన్నారు.