ముందు శ్రీరెడ్డి… తర్వాత మాధవీలత… టీవీల ముందుకు వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తెలుగమ్మాయిలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుర్కొంటోన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ ఇద్దరితో పోలిస్తే.. మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఎక్కువ హిట్ సినిమాలు చేసింది. ఇటీవల ‘అ !’, అంతకు ముందు ‘దర్శకుడు’, ‘అమీ తుమీ’ సినిమాలతో విజయాలు అందుకుంది. వీళ్ళిద్దరి సమస్యలను ఉదహరిస్తూ… ‘తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటోంది?’ అని ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఒక ప్రేక్షకుడు అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఈషా ఇష్టపడలేదు. లైవ్లో ప్రశ్న చదివేయడంతో సింపుల్గా ‘నో కామెంట్స్ ప్లీజ్…’ అని రాజకీయ నాయకుల తరహాలో సమాధానం చెప్పింది. దీనికి తోడు చాలామంది ప్రభాస్తో సినిమా ఎప్పుడు చేస్తారు? నాని నిర్మాణంలో ‘అ!’ చేశారు. నాని సరసన కథానాయికగా ఎప్పుడు చేస్తారు? ఎన్టీఆర్తో సరసన ఎప్పుడు నటిస్తారు? వంటి ప్రశ్నలు అడగటంతో కొంచెం ఇబ్బంది పడింది. అవకాశాలు వస్తే నేను చేయడానికి సిద్ధమేనని నవ్వుతూ సమాధానాలు ఇచ్చింది.