మన ప్రజాస్వామ్యాన్ని నాలుగు స్తంభాలు నిలబెడుతున్నాయని గంభీరంగా చెప్పుకుంటూ ఉంటాం.
- ఎగ్జిక్యూటివ్ (గవర్నమెంట్)
- లెజిస్లేచర్ ( పార్లమెంట్, స్టేట్ అసెంబ్లీస్..)
- జ్యుడిషియరీ (సుప్రీమ్ కోర్ట్, హై కోర్ట్స్, అదర్ జ్యుడిషియల్ సెంటర్స్..)
- మీడియా (న్యూస్ పేపర్, ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరిచేవన్నీ)
ఈ నాలుగు పిల్లర్స్ గురించి తెలుసుకునేటప్పుడు, వేరే వాళ్ళకు చెప్పేటప్పుడు కూడా చాలా గర్వంగా ఫీలవుతూ ఉంటాం. అలా ఫీలయ్యేలా చేస్తూ ఉంటారు. మనలను కాపాడడం కోసమే అవి ఉన్నాయని భ్రమింప చేస్తూ ఉంటారు. వీటి నిర్వహణ ఖర్చు మొత్తం మనది అన్న మాట వరకూ వాస్తవం. అవి మన కోసం పనిచేస్తున్నాయా? అంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం.
మంచు నరహరి. ఓ తెలుగు వాడు. 20ఏళ్ళుగా ఓ కిరాయి మడిగెలో కష్టపడి వ్యాపారం చేశాడు. వచ్చిన లాభాలకు తోడు కొంత డబ్బు అప్పు చేసి వ్యాపారంలో ఇంకో మెట్టు పై స్థాయికి వెళ్ళాలన్న ఉద్ధేశ్యంతో సొంత మడిగె కొన్నాడు. ఆల్ హ్యపీస్ అనుకున్న టైంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోని స్వతంత్ర పౌరుడైన ఆ నరహరికి నయిూం అనే ఓ గ్యాంగ్స్టర్ నుంచి కాల్ వచ్చింది. రెండు కోట్లు ట్యాక్స్ కట్టమన్నాడు. ‘ఎవడ్రా నువ్వు? ఎందుకు కట్టాలిరా శిస్తు..?’ అని ప్రశ్నించే ధైర్యం నరహరికి లేకపోయింది. పైన మనం చెప్పుకున్న నాలుగు స్తంభాలే ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ నాలుగుటిపైన నరహరికి నమ్మకం ఉండి ఉంటే నయిూంని ప్రశ్నించేవాడు.
రెండు కోట్లు డబ్బు చెల్లించే స్థాయి తనకు లేకపోవడంతో అదే విషయం చెప్పాడు. వెంటనే ఆ నయిూం ముఖ్య అనుచరుడు పాశం శ్రీను రంగంలోకి దిగాడు.సందెల సుధాకర్ అనే ఇంకొకడితో కలిసి నరహరిని కిడ్నాప్ చేసి స్కార్పియో వాహనంలో… హైదరాబాద్ మహా నగరంలోని ఎల్.బి. నగర్కు తీసుకెళ్ళారు. అక్కడ నుంచి మరో వాహనంలో నరహరి కళ్ళకు గంతలు కట్టి గ్యాంగ్ స్టర్ నయిూం దగ్గరకు తీసుకెళ్ళారు.
హైదరాబాద్ పోలీసులు వారానికో ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు. అన్ని జంక్షన్స్లో ప్రజా భద్రత గురించి మైకుల్లో ఊదరగొడుతూ ఉంటారు. సామాన్య జనాలకు అడుగడుగునా పోలీసు వాహనాలు, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా కనిపిస్తూనే ఉంటారు. వెహికల్కి సంబంధించిన అన్ని పత్రాలూ మన దగ్గర ఉన్నా వాళ్ళూ మనకు ‘కనిపిస్తూనే’ ఉంటారు. సిటీ అంతా సిసి కెమేరాలే అని చెప్తూ ఉంటారు. కానీ నయిూం గ్యాంగ్ వెహికల్ మాత్రం ఎవ్వరికీ కనిపించలేదు. నరహరి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళుతున్న విషయం కూడా మన పోలీసులకు తెలియలేదు.
తన స్టైల్లో నరహరిని బెదిరించాడు నయిూం. భార్యా, పిల్లలను చంపేస్తానన్న నయిూంని నరహరి ఎంతలా బ్రతిమాలి ఉంటారో, తలెత్తుకు తిరగాల్సిన నిజాయతీపరుడైన ఓ పౌరుడు….తన కోసం తాను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలన్నీ విఫలమైన వేళ…తను కష్టపడి వ్యాపారం చేసి సంపాదించుకున్న డబ్బులో కొంత భాగాన్ని ట్యాక్స్ రూపంలో కడుతూ ….తన జీవితం సంతోషంగా ఉండడం కోసం….తన ఇంటి కోసం నాలుగు స్తంభాలు ఏర్పాటు చేసుకుంటే ….తనకు అవసరమైన టైంలో ఆ నాలుగు స్తంభాలూ కేవలం ‘దేవతా వస్త్రాలే’ అన్న విషయం తెలిసిన వేళ…..ఓ క్రిమినల్ దగ్గర ఓ పౌరుడు తలొంచాల్సి వచ్చింది. ఆ క్షణం గురించి ఆలోచిస్తే నాలుగు స్తంభాల అస్తిత్వమూ ప్రశ్నార్థకమే?
నయిూం దగ్గర నుంచి బయటకు వచ్చాక కూడా ఆ నాలుగు స్తంభాలు తనకోసం ఉన్నాయన్న నమ్మకం నరహరికి రాలేదు. అందుకే 12మంది దగ్గర అప్పుచేసి మరీ నయిూంకి డబ్బులు ఇచ్చేశాడు. ఈ మొత్తం సంఘటన జరిగింది 10.07.2015న. పోలీసులకు కొత్త వెహికల్స్ ఇచ్చేశాం. హైటెక్ స్థాయిలో టెక్నాలజీని వాడుతున్నాం. హైదరాబాద్లో చీమ చిటుక్కుమన్నా మాకు తెలిసిపోతుంది అన్న కబుర్లు చెప్పాక. కానీ దశాబ్ధం పైగా ఓ క్రూర జంతువు జనారణ్యంలో వేటాడుతూ ఉంటే మన మూల స్థంభాలన్నీ సైలెంట్గా ఉన్నాయా? ఆ క్రూరజంతువుతో చేతులు కలిపాయా? ఇప్పుడు కూడా బేరాలు కుదరక మట్టుపెట్టాయా?
ఇంత జరిగిన తర్వాత కూడా నరహరి…అప్పులు చేసి నయిూంకి డబ్బులు చెల్లించానని ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలి అని ప్రాధేయపడుతున్నాడు. కానీ నరహరి అడగాల్సిన విధానం అది కాదు.
నేను పుట్టినప్పటి నుంచి కూడా…… నన్ను కాపాడటానికి మీరు ఉన్నారని… మీరే చెప్పిన మాటలను నమ్మి……నా కోసం పనిచేస్తున్నారన్న నమ్మకంతో మీకు ట్యాక్స్ల రూపంలో డబ్బులు కడుతూ వచ్చాను. మీ జీతాలన్నీ నేనే భరిస్తున్నాను. నన్ను కాపాడడం మీ బాధ్యత. అందులో మీరు ఫెయిల్ అయ్యారు. గౌరవంగా నా నష్టాన్ని మీరు భర్తీ చేసి క్షమాపణ చెప్తారా? లేక మిమ్మల్ని అందరినీ ఉద్యోగంలో నుంచి తీసేయమంటారా? కొత్త వ్యవస్థని ఏర్పాటు చేసుకోమంటారా? అని. అది అసాధ్యం కదా. మనకు ఆ విధంగా ప్రశ్నించే అధికారం లేదా? హక్కు లేదా? అంటే మనం స్వతంత్ర పౌరులం కాదా?