రాజధాని అమరావతిని కొండెక్కించిన ప్రభావం ఏపీ ప్రభుత్వంపై ఎక్కువగానే పడుతోంది. ముందుగా హ్యాపీనెస్ట్ కొనుగోలుదారులు ప్రభుత్వాన్ని కోర్టుకు లాగాలని డిసైడయ్యారు. ముందుగా లీగల్ ప్రాసెస్ ప్రకారం సీఆర్డీఏకు నోటీసులు జారీ చేశారు. తమతో ఒప్పందం చేసుకుని .. అడ్వాన్స్ తీసుకున్న దాని ప్రకారం ఇంత వరకూ ఫ్లాట్లు అప్పచెప్పలేదని కనీసం ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి చూపించలేదని చెబుతూ లీగల్ నోటీసులు జారీ చేశారు. తాము కట్టిన పది శాతం డబ్బును ఇరవై నాలుగు శాతం వడ్డీతో కలిపి ఇవ్వడమే కాకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రూ. 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీఆర్డీఏకు నోటీసులు పంపారు.
సీఆర్డీఏ స్పందనను బట్టి ‘రేరా’ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. హ్యాపీ నెస్ట్ అనేది అమరావతిలో సీఆర్డీఏ చేపట్టిన ప్రాజెక్ట్. 12 టవర్స్, 1200 ప్లాట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బుకింగ్స్ ప్రారంభించిన గంటలోనే అన్ని ఫ్లాట్స్ అమ్మకాలు పూర్తయ్యాయి. హ్యాపీ నెస్ట్ కోసం నేలపాడులో 18 అంతస్థుల నిర్మాణాలతో 12టవర్లు నిర్మించటానికి టెండర్లు పిలిచారు. ప్రాజెక్టు మేనేజ్మెంట్ కంపెనీగా సీబీఆర్ఈని నియమించారు. కాంట్రాక్ట్ను షాపూర్జీపల్లోంజీ సంస్థ పొందింది. 1200 ఫ్లాట్లకు దాదాపు రూ. 90 కోట్ల మేర కొనుగోలు దారులు అడ్వాన్స్ చెల్లించారు.
కానీ వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. డబ్బులు కట్టిన వారిని పట్టించుకోలేదు. 2020లో పనులు ముందుకు సాగకపోవడంతో న్యాయపోరాటానికి వెళతామని కొనుగోలుదారుల హెచ్చరించారు. ఆ సమయంలో ప్రభుత్వం రివర్స్ టెండర్లకు వెళ్లింది. అయితే టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పనులు ఆపేయడానికి సీఆర్డీఏ వద్ద ఒక్క కారణం కూడాలేదు. దీంతో పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాల్సి రావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.