తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించడంతో… ఆ పార్టీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమయినట్లయింది. తనకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత కేటీఆర్.. వెంటనే హరీష్ రావును కలిశారు. ఆయన కూడా కలసి పని చేస్తామని ప్రకటించారు. కేటీఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఆ తర్వా కార్యవర్గ సమావేశానికి కూడా హాజరయ్యారు. కానీ.. హఠాత్తుగా ఈ రోజు పెద్ద సంఖ్యలో హరీష్ అనుచరులు… మినిస్టర్ క్వార్టర్స్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఎంతగా వచ్చారంటే.. బంజారాహిల్స్ లో చాలా రోడ్లు హరీష్ ఇంటికి వచ్చిన అనుచరుల కార్లతోనే నిండిపోయాయి.
పార్టీలో మొదటి నుంచి కేసీఆర్ తో పాటు కష్టపడుతోంది హరీష్ రావేనన్న సానుభూతి ఉంది. ఈ క్రమంలో ఆయనకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో వారంతా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ హరీష్ రావు ముఖ్య అనుచరులు మాత్రం.. ఈ విషయంలో మీడియా హడావుడి లేకుండా జాగ్రత్త పడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించినందుకు అభినందించడానికి వచ్చారని చెబుతున్నారు. తరలి వచ్చిన హరీష్ అనుచరుల కారణంగా మినిస్టర్స్ క్వార్టర్స్ జామ్ అయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో వ్యూహకర్తగా హరీష్ రావు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఓడించడంలో.. సీఎం కేసీఆర్ గజ్వేల్లో భారీ మెజార్టీతో గెలవడంలో కీలక పాత్రపోషించారు.
అభిమానులు భారీగా తరలి రావడంతో.. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన తొలి కార్యవర్గ సమావేశానికి హరీష్ రావు హాజరు కాలేకపోయారు. శుక్రవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. అయితే ఆ సమావేశంలో కేసీఆర్ ఉన్నారు. కానీ ఈ రోజు మాత్రం కేసీఆర్ లేరు. కేటీఆర్ మాత్రమే ఉన్నారు. అందుకే ఆయన హాజరు కాలేదా.. అన్న చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం.. హరీష్ రావు అసలు అసంతృప్తిలో లేరని… ఆయన అనుచరులు శుభాకాంక్షలు చెప్పడానికే వచ్చారని .. ఘంటాపథంగా చెబుతున్నారు.