హైదరాబాద్ లో చాలా మంది కార్పొరేటర్లు కనిపించుట లేదు. భారీ వర్షాలు వరదలతో ప్రజలు విలవిల్లాడినా సదరు కార్పొరేర్ల దర్శన భాగ్యం లభించలేదు. మంత్రులు కాలనీల్లోపర్యటించారు గానీ స్థానిక ప్రజా ప్రతినిధులు పత్తా లేరు.
స్థానికంగా ఏ సమస్య వచ్చినా ముందు స్పందించాల్సింది కార్పొరేటర్లు. కానీ కొన్ని నెలలుగా రోడ్లు అధ్వాన్నంగా మారి ప్రజలకు నరకం చూపిస్తున్నా కార్పొరేటర్లు పట్టించుకోలేదు. చాలా మంది అసలు కనీసం ముఖం కూడా చూపించడం లేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రం స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 150 డివిజన్లకు గాను, ప్రజలు 99 సీట్లు కట్టబెట్టారు. ఈ 99 మంది కార్పొరేటర్లలో అతి తక్కువ మంది మాత్రమే జనంలో కనిపిస్తున్నారు.
భారీ వర్షాలకు కాలనీలు చెరువులుగా మారాయి. రోడ్లు కాలువలైపోయాయి. రోజుల తరబడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికినా కార్పొరేటర్లు అడ్రస్ లేరు. ప్రజలకు ముఖం చాటేశారు. ఈ పరిస్థితుల్లో జనంలోకి వచ్చి ఏదో సాయం చేయడానికి ప్రయత్నించిన కార్పొరేటర్ల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్ట వచ్చు. కార్పొరేటర్లు ప్రజా సేవ ఎలా చేయాలో కేసీఆర్ బృందం హైటెక్ శిక్షణ ఇచ్చింది. నగర శివార్లలోని ఓ విలాస వంతమైన రిసార్టులోమూడు రోజుల శిక్షణ శిబిరం నిర్వహించింది. ఆ లగ్జరీ రిసార్టులో ఏం శిక్షణ ఇచ్చారో గానీ చాలా మంది కార్పొరేటర్లు తాము ప్రజలకు సేవకులం అనే విషయమే మర్చిపోయినట్టున్నారు.
వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతోంది. హటాత్తుగా ఇళ్లను కూలిస్తే ఎక్కడ ఉండాలనేది పేదల సమస్య. అది అక్రమ నిర్మాణమే. అందులో అనుమానం లేదు. అయితే ఉన్నపళంగా నీడ కోల్పోతే ఎక్కడికి పోతారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు. ఇదీ ఒక సమస్యే. దీన్ని ప్రభుత్వం కూడా పట్టించుకున్నట్టు లేదు. కనీసం కార్పొరేటర్లయినా చొరవ తీసుకుంటారనుకుంటే అదీ లేదు. గూడు కోల్పోయిన వారికి కనీసం ఓ పూట భోజనం ఏర్పాట్లు చేయడానికి కూడా కార్పొరేటర్లకు సమయం లేనట్టుంది. పేదలకు గాలికి వదిలేసి తమ పనులు తాము చేసుకుంటున్నారు. ఇతర పార్టీల కార్పొరేటర్లకూ తెరాస కార్పొరేటర్లకూ చాలా తేడా ఉందనే కామెంట్లు వినిపించడానికి కారణం ఇదే.