‘నేను వి.ఐ.పి.ని. నా భద్రతా సిబ్బంది నా చెప్పుల పట్టీలు పెడితే తప్పేంటి?’…ఇది ఓ మంత్రి వర్యుడి మాట. ఇది పెద్ద విషయం కాదని కొంతమందికి అనిపించొచ్చు. కానీ రాచరికం నాటి రేసిజానికి ఇవే ఆజ్యం పోస్తున్నాయి. తక్కువ స్థాయి కులాలు, తక్కువ స్థాయి మనుషులు, స్త్రీలు, పురుషులు లాంటి తారతమ్యాలు కొంతవరకూ తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. కానీ ఈ ‘వి.ఐ.పి. రేసిజం’ మాత్రం చాలా బలంగా వేళ్ళూనుకుంటోంది. కొన్ని కోట్ల మంది ప్రజలను బానిసలుగా చేసే దిశగా సాగుతున్నామని భయమేస్తోంది. పదవిలో ఉన్న రాజకీయ నాయకులను, వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా, రాజకుటుంబాల స్థాయిలో సేవించడాన్ని చూస్తూ ఉంటే రాచరికం నాటి పరిస్థితులకు చాలా దగ్గరగానే ఉన్నామని అనిపిస్తోంది.
మానవ హక్కుల పోరాటం, కులాల, మతాల హక్కుల కోసం పోరాటం అనే వాళ్ళు కూడా ఈ వి.ఐ.పి. రేసిజానికి వ్యతిరేకంగా నోరెత్తడం లేదు. వాళ్ళు చేస్తున్న పోరాటంలోనే వాళ్ళు వి.ఐ.పి.లు కాబట్టి. అలాంటి హోదా అందరూ కోరుకుంటున్నారు కాబట్టి. దేవుడి దర్శనం, పుష్కర స్నానం…వేరే ఏ సామూహిక కార్యక్రమమైనా కూడా మొదటి వరుస వాళ్ళదే. బుగ్గ కార్లు, ఏ నేరం చేసినా తప్పించుకోవచ్చన్న ధీమా, పోలీసులు, అధికారులే బానిసల్లా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితి. మొత్తంగా వాళ్ళు ఒక ప్రత్యేక జాతిగా కనిపిస్తున్నారు. ఆ విధమైన పరిస్థితులను తమ రాజకీయ తెలివితేటలతో వాళ్ళే సృష్టించుకున్నారు. ప్రజల ఆలోచనలను కూడా ప్రభావితం చేశారు. ఆ నాయకులు ఓ పేదవాడితో మాట్లాడితే వార్త. వాడి భుజం మీద చెయ్యేసి మాట్లాడితే, వాడితో కలిసి సహపంక్తి భోజనం చేస్తే…అయ్యబాబోయ్….ఆ అద్భుతాన్ని మన మీడియా కూడా ఓ స్థాయి పొగడ్తలతో ప్రచురిస్తుంది. మిగతా ప్రజలందరినీ కూడా వాళ్ళు తక్కువగా చూస్తున్న మాట వాస్తవం. ‘ప్రజల కోసం ప్రాణాలిస్తాం’ లాంటి డైలాగులు ఎన్నైనా చెప్పొచ్చుగాక…కానీ ఆ ప్రజలందరినీ వాళ్ళు తక్కువగా చూస్తున్నారన్నది వాస్తవం. పదవి ఉన్నంత కాలం మన నాయకులకు సాటి మనుషులెవ్వరూ మనుషుల్లా కనిపించడం లేదు.
అన్నింటికీ మించి మేం ఏం చేసినా చెల్లిపోతుంది అన్న భావన మన నాయకులకంటే కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చాలా ఎక్కువ ఉంటోంది. మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవ సంఘటనలు కూడా అదే నిజమని చెప్తున్నాయి. తన కార్ ఓవర్ టేక్ చేశాడని ఓ విద్యార్థిని కాల్చిపడేశాడు ఓ ఎమ్మెల్సీ కొడుకు. ఓ మంత్రి కొడుకయితే ఏకంగా నడిరోడ్డుపైనే ఓ యువతిని టీజ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు. ఆ స్త్రీని కార్లోకి లాగాలని కూడా ప్రయత్నించాడు. సిసి కెమేరాల్లో రికార్డయిన దృష్యాలు చూస్తుంటే ‘వీడికెందుకు ఇంత కండకావరం’ అని ఎవ్వరికైనా అనిపించాల్సిందే. వాడెందుకు అలా చేశాడో నెల తిరిగేసరికి కోర్టుల సాక్షిగా తెలుగు ప్రజలందరికీ అర్థమైంది. కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. కానీ వాళ్ళ వెనకాల ఉంది కూడా అధికారంలో ఉన్న, అధికారానికి దగ్గరగా ఉన్న రాజకీయ నాయకులే.
ఇంకా మనవాళ్ళు వేద కాలం నాటి వివక్షల గురించి మాట్లాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు కానీ ఈ వి.ఐ.పి. రేసిజం గురించి మాట్లాడడం లేదు. మన దగ్గర మతాలు, కులాల గురించి మాట్లాడేవాళ్ళందరూ నాయకులే. ఓట్ల కోసం మాట్లాడే వాళ్ళే ఎక్కువ. వాళ్ళందరికీ కూడా అధికారంలోకి రావాలని ఉంటుంది. అధికారంలోకి వచ్చాక అధికార దర్పం చూపించాలని ఎవరికి మాత్రం ఉండదు? అందుకే వాళ్ళెవ్వరికీ ఇది తప్పుగా అనిపించడం లేదు.
సమసమాజం కోసం, మన కోసం, మనం తెచ్చుకున్న స్వాతంత్ర్య దినోత్సవం రోజే… ‘నేను వి.ఐ.పి.ని, నా చెప్పులు ఇంకొకడు తొడిగితే తప్పేంటి?’ అని ప్రశ్నించే ఓ పాలకుడి గురించి దేశం చర్చించుకుంటోందంటే మన స్వాతంత్య్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి.