తెలుగు సినిమా ఎంతో ఎత్తుకు ఎదిగింది.. ఎదుగుతోంది. అది కాదనలేని సత్యం! కానీ ఈ ఎదుగుదలలో ఉన్న నాణ్యత ఎంత? మన సత్తా కేవలం కలక్షన్లలోనా, బాక్సాఫీసు అంకెలా టాలీవుడ్ ప్రతిభకు కొలమానాలా? మరి అవార్డుల మాటేంటి. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు రావడం గొప్పాతి గొప్ప. ఆమాటకొస్తే అసాధ్యమే అనుకొన్నారంతా. మొన్న బాహుబలి సినిమానే లేకపోతే జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకొనేంత అర్హత తెలుగు సినిమాకి లేదని విశ్లేషకులు ఒక్క మాటలో తేల్చేసేవారు. కానీ బాహుబలి దయ వల్ల ఆ అపవాదు తొలగింది. ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీలోనూ తెలుగు సినిమాకి మరోసారి చుక్కెదురు అయ్యింది. ప్రతీ యేటా ఆస్కార్ స్క్రీనింగ్ కోసం ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు కోసం మన దేశం నుంచి అధికారిక ఎంట్రీ వెళ్తుంటుంది. ఈసారి దేశ వ్యాప్తంగా 29 సినిమాలు పోటీ పడ్డాయి. అందులో మన తెలుగు నుంచి రుద్రమ దేవి, కంచె చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈ సారి భారత చలన చిత్ర సమాఖ్య తమిళ చిత్రం విసారణైని ఎంపిక చేసింది.
రుద్రమదేవి, కంచె కలిపిదే దాదాపు రూ.100 కోట్ల సినిమాలు. కానీ తమిళ సినిమా విసారణై కోటిన్నరతో తీసిన ఓ సాధారణ బడ్జెట్ సినిమా. మన సినిమాల్లో లేనిది.. ఆ సినిమాలో ఉన్నదీ ఒక్కటే వాస్తవికత. రుద్రమదేవిని తక్కువ చేసి చెప్పడం లేదు గానీ, రుద్రమ దేవి ఘనత కంటే విజువల్ హంగామానే ఎక్కువ కనిపించింది ఆసినిమాలో. రుద్రమదేవి చరిత్రకు కాస్త మసాలా కలిపి కమర్షియల్ హంగులు అద్దే ప్రయత్నం చేశాడు గుణ శేఖర్. దాంతో.. క్లాసిక్ చిత్రంగా జనం ముందుకు రావాల్సిన సినిమా ఓ మాస్ సినిమాగా రూపుదిద్దుకొంది. కంచెది వేరే కథ. క్రిష్ తన ఎఫెక్ట్ అంతా ఆ సినిమాలో పెట్టేశాడు. రెండో ప్రపంచ యుద్ద కాలం నాటి రోజుల్లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లడంలో మాత్రం విఫలయ్యాడు. బడ్జెట్ పరిమితులో, లేదంటే పరిస్థితులు అనుకూలించలేదో తేలీదు గానీ… ఆ నాటి వాతావరణం కళ్లకు కట్టి చూపించడంలో విఫలమయ్యాడు. బహుశా ఆస్కార్ కమిటీ ఆ విషయాన్ని పరిగణలోనికి తీసుకొనే ఈ సినిమాని పక్కన పెట్టేసి ఉంటుంది.
విసారణైలో భారీ హంగుల్లేవు. సాంకేతిక నైపుణ్యం లేదు. కానీ జీవితం ఉంది. వ్యధ ఉంది. ఓ నలుగురు వ్యక్తుల పాట్లు, వాళ్ల ప్రయాణం ఉంది. సాధారణంగా పోలీస్ స్టేషన్ నేపథ్యంలో దృశ్యాలంటే అవి ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సినిమాల్లో కేవలం సినిమాటిక్ దృశ్యాలే కనిపిస్తాయి. వాస్తవం వేరు. ఆ వాస్తవం ఎంత కఠోరంగా ఉంటుందో చూపించిన సినిమా ఇది. అందులో చాలా దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా తెరకెక్కించాడు దర్శకుడు. కథలో బలం, సన్నివేశాల్లో గాఢత, హృదయాన్ని మెలిపెట్టే భావోద్వేగాలు ఇవన్నీ ఉండబట్టే ధనుష్ అంతటి వాడు ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చాడు. మన దగ్గరెప్పుడూ హంగులూ ఆర్భాటాలకే ప్రాధాన్యం. అందుకే మన సినిమా గ్లామర్కి దగ్గరగా ఇలాంటి పురస్కారాలకు దూరంగా ఉంటుంది. ఇదే విషయం మనవాళ్లని అడిగితే.. `అవార్డు సినిమాలెవడికి కావాలండీ` అంటూ కమర్షియల్ గా మాట్లాడతారు. నిజమే.. సినిమా వ్యాపారం. డబ్బే ప్రధానం. కానీ.. అప్పుడప్పుడూ హృదయాన్ని తట్టి లేపే ప్రయత్నాలు చేయడం తప్పు కాదు కదా? ధనుష్ పెట్టబడి పెట్టింది కోటిన్నరే. కానీ వచ్చింది పది కోట్లు. ఇప్పుడు ఆస్కార్ బరికి దర్జాగా వెళ్తోంది. ఇలాంటి ప్రయత్నాలు మన హీరోలెందుకు చేయరు? ధనుష్ ఇచ్చిన స్ఫూర్తితో ఇక నుంచైనా చేస్తే బాగుణ్ణు. అలా చేయాలని కోరుకొందాం. ఎందుకంటే వసూళ్లు నిర్మాతలు, బయ్యర్ల కడుపు, జేబులు నింపుతాయి. అదే అవార్డొస్తే.. తెలుగు ప్రేక్షకుల హృదయాలు తృప్తి పడతాయి. కనీసం అందుకోసమైనా ఇలాంటి మంచి ప్రయత్నాలు చేయొచ్చుగా..?!