జగన్ బాగా మాట్లాడాడు. మా బాగా మాట్లాడాడు. ఇన్నాళ్ళుగా తన చుట్టూ తాను ఏర్పాటు చేసుకున్న ‘జైలు’ నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు జగన్ హోదానే వేరు. ఆ రోజులలో రాజకుమారుడి స్థాయి జగన్ది. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు లోకేష్ లాగా అన్నమాట. ఆ తర్వాత వైఎస్ ఆకస్మిక మరణం… సొంత పార్టీవైపు పయనం….తను చేసిన తప్పులకు తోడు రాజకీయ ప్రత్యర్థుల దెబ్బకు కేసుల చట్రంలో ఇరుక్కోవడం లాంటి విషయాలను పక్కన పెడితే…, రాజకీయ నాయకుడిగా ప్రజలను, సాటి నాయకులను కలిసే విషయంలో జగన్కి బోలెడన్ని నిబంధనలు ఉండేవి. వయసు, అనుభవం రెండూ తక్కువే కావడంతో అందరితోనూ తరచుగా కలుస్తూ ఉంటే తన ‘ప్రత్యేకతకు’ భంగం కలుగుతుందని భావించేవాడు. తన స్థాయికి తగిన వారినే కలిసేవాడు. అలాగే తన అవసరం ఉన్నవాళ్ళను, తాను ఓదార్చాలనుకున్నవాళ్ళను మాత్రమే కలిసేవాడు. ఆ కలవడం అంతా కూడా జగన్ వైపు నుంచే ఉండేది. తనను గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకోవడంతో వచ్చే సమస్యలే ఇవన్నీ. అలా ఊహించుకుని మన చుట్టూ మనమే మానసికంగా ఓ జైలును ఏర్పాటు చేసుకుంటాం. ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకపోవడం, తన పార్టీ అభ్యర్థులకు గర్వంగా చెప్పుకునే స్థాయి భారీ మెజారిటీ రావడంతో తనకు తిరుగులేదనుకున్నాడు జగన్. తను ఏర్పాటు చేసుకున్న జైలు గోడలను ఇంకా పటిష్టం చేసుకున్నాడు. తెలుగు వాళ్ళందరికీ దగ్గరవడంతో పాటు, వాళ్ళు గుడ్డిగా తనను నమ్మేలా చేసుకోవడంలో సక్సెస్ అయిన మీడియా, కాబోయే ప్రధాని అని అప్పటికే ఓటర్లకు తెలిసిపోయిన నరేంద్రమోడీ లాంటి వాళ్ళు తన వెనుక ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్తో సహా నాలుగు ఓట్లు తెచ్చిపెడతారు అని తను నమ్మిన అందరినీ కలిశాడు చంద్రబాబు. తన స్థాయి, హోదా లాంటి ఆలోచనలు ఏమీ లేకుండా పవన్ ఇంటికి వెళ్ళి మరీ పవన్ని ‘ఖుషీ’ చేశాడు. కానీ జగన్ మాత్రం కాబోయే ముఖ్యమంత్రిని నేనే….సిఎం ఛెయిర్ నాదే…అని అనుకుంటూ బిర్రబిగుసుకుని కూర్చున్నాడు. ఆ గర్వమే గూబగుయ్యిమనేలా చేసింది.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి క్రమక్రమంగా మారుతూ వస్తున్నాడు జగన్. ప్రవాస తెలుగు వాళ్ళతో సంభాషణ మరో అంకం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు ఎవ్వరైనా సరే ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అభినందించాల్సిన విషయమే. అయితే నాయకుల అభిప్రాయాలు, విధానాలను ప్రజలకు చేరువ చేసే మీడియాతో ఇంటరాక్ట్ అవడం కూడా జగన్ నేర్చుకోవాలి. మళ్ళీ మీడియా అంటే సాక్షి, కొమ్మినేని లాంటి హోం డిపార్ట్మెంట్స్ కాదు. చంద్రబాబు అనుంగు మిత్రుడయిన రాధాకృష్ణలాంటి వాళ్ళను కూడా ఫేస్ చేసే ధైర్యం జగన్కి ఉండాలి. తన వైపు నుంచి ఎలాంటి తప్పులూ లేనప్పుడు ఎలాంటి ఆరోపణకైనా, ప్రశ్నకైనా భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియా జర్నలిస్టులతో ముఖాముఖి ఇంటర్వ్యూలంటేనే జగన్కి ప్రత్యేకమైన భయాలు ఉన్నట్టున్నాయి. తప్పు చేసినవాళ్ళకే అలాంటి భయాలు ఉంటాయి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి అభిప్రాయాలన్నీ తప్పు అని నిరూపించడానికైనా తెలుగు జర్నలిస్టులతో ముఖాముఖి ఇంటర్వ్యూలకు జగన్ సిద్ధపడాలి.
ప్రజలకు ఉన్న సందేహాలు, ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రెడీ అయిన జగన్… ఇదే సందర్భంలో మీడియాను కూడా ఎదుర్కోగలడా? టిడిపి అనుకూల మీడియా ప్రత్యేక హోదా గురించి తప్పుడు రాతలు రాస్తోంది అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణల కంటే కూడా డైరెక్టుగా ఆ మీడియా జర్నలిస్ట్లతో ఫేస్ టు ఫేస్ ఇంటర్యూలకు సిద్ధపడితే ఎవరేంటన్న విషయాన్ని ప్రజలే నిర్ధారించుకుంటారు. జగన్కు ఆ సత్తా, సామర్ధ్యం ఉన్నాయా?