మోహన్ లాల్ – ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ఒప్పమ్’. మూడు వారాల్లోనే 27 కోట్లు వసూలు చేసి… అక్కడ సూపర్ హిట్ చిత్రాల జాబితాలో అగ్ర స్థానంలో కూర్చొంది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల అవుతోంది. ఓవర్ సీస్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగు హక్కుల్ని కైవసం చేసుకొంది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలన్నది ఈ సంస్థ ఆలోచన. మోహన్లాల్ పాత్రకు నాగార్జున అయితే బాగుంటాడని నిర్మాతలు భావిస్తున్నార్ట. త్వరలోనే నాగ్ని కలసి ఈ సినిమా చూపించాలని, నాగ్ అంగీకారం తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇంతకీ ఒప్పమ్ కథ ఏమిటంటే….మోహన్ లాల్ ఈ సినిమాలో అంధుడు. ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో ఓ హత్య జరుగుతుంది. కిల్లర్ తప్పించుకుంటాడు. ఆ హంతకుడిని మోహన్లాల్ ఎలా పట్టుకొన్నాడన్నది కథాంశం.
గుడ్డివాడి పాత్ర చేయడానికి తెలుగు హీరోలు సిద్దంగా ఉండరు. అయితే.. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ముందు నుంచీ ఉత్సాహం చూపించే ఏకైక కథానాయకుడు నాగార్జున. ఇటీవల ఊపిరి కోసం సినిమా మొత్తం వీల్ ఛైర్కే పరిమితమయ్యే పాత్రలో కనిపించాడు. ఆ ధైర్యంతోనే ఒప్పమ్ నిర్మాతలు నాగ్ని సంప్రదించాలని భావిస్తున్నార్ట. ఒకవేళ నాగ్ నో అంటే అప్పుడు ఒప్పమ్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన . మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్లాల్కి తెలుగులో ఇమేజ్ పెరగడంతో డబ్బింగ్ ఆప్షన్ కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నారు. సో.. ఒప్పమ్ రీమేకా, డబ్బింగా అనేది నాగ్ నిర్ణయంపై ఆధారపడి ఉందన్నమాట.