మరో అధికార పార్టీ భాజపాతో బంధం తెంచుకునేందుకు సిద్ధమౌతోంది..! మరో ముఖ్యమంత్రి కూడా మోడీ పెత్తనాన్ని భరించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఎన్డీయేకి విడాకులు ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారనే చెప్పొచ్చు. గడచిన రెండు వారాల్లో ఆయన మాట తీరులో గణనీయంగా వస్తున్న అనూహ్య మార్పే అందుకు సాక్ష్యం. మిత్రపక్షమైన భాజపా తీరును సూటిగా ప్రశ్నిస్తున్నారు. మోడీకి ఎదురెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
మోడీ ప్రభుత్వం తీసుకుని రాబోతున్న సిటిజెన్ షిప్ బిల్లును వ్యతిరేకిస్తూ మే 17న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నితీష్ ను కలిశారు. ఇది భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశం అంటూ నితీష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ బిల్లు పార్లమెంటులో చర్చకు వస్తే వ్యతిరేకంగా ఓటు వేసేందుకు జేడీయూ సిద్ధంగా ఉన్నట్టు నితీష్ హామీ ఇవ్వడం గమనార్హం! ఇక, మే 26న ఓ కార్యక్రమంలో నితీష్ మాట్లాడుతూ… నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తానూ సమర్థించాననీ, కానీ ఎంతమందికి ఇది ఉపయోగపడిందని ప్రశ్నించారు..? బడాబాబులు ఒక చోటి నుంచి మరో చోటిని డబ్బు రవాణా చేసుకున్నారని, పాత నోట్లకు కొత్తగా మార్చుకున్నారనీ, పేదలు మాత్రమే ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్యానించారు.
ఇలా మాట్లాడిన మర్నాడే… అంటే, మే 27న నితీష్ కి కేంద్రం చిన్న ఝలక్ ఇచ్చింది. తుఫాను బాధితుల సహాయం కోసం కేంద్రం ఇస్తామని ప్రామిస్ చేసిన రూ. 1750 కోట్లలో.. ఓ రూ. 500 కోట్లకు కేంద్రం కత్తెర వేసింది! 2017లో బీహార్ లోని 19 జిల్లాలు తీవ్ర తుఫానుకి గురయ్యాయి. దీంతో కేంద్ర సాయంగా రూ. 1250 కోట్లు ఇస్తామన్నారు. దీనికి అదనంగా మరో రూ. 500 కోట్లు ఇస్తామని మోడీ ప్రకటించారు. ఇప్పుడా మాట వెనక్కి తీసుకుని… రూ. 500 కోట్లు కట్ చేశారు! దీంతో నితీష్ మరింత అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఆవేదనలోంచి, మే 29న బీహార్ కి ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ తెర మీదికి తెచ్చారు. నిజానికి, ఎన్డీయేతో దోస్తీ కుదిరాక దీని గురించి నితీష్ మాట్లాడటం మానేశారు. కానీ, ఇప్పుడు మళ్లీ ఇదే అంశాన్ని తెర మీదికి తెచ్చి.. వెనకబడిన రాష్ట్రాలకు హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
గడచిన రెండు వారాలుగా నితీష్ వ్యవహారం ఇలా మారుతూ వస్తోంది. మిత్రపక్షం స్థాయి దాటి, ఒక ప్రతిపక్షంగా భాజపాని నిలదీయడం, మోడీ నిర్ణయాలను తప్పుబట్టడం, కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వీటి అంతిమ లక్ష్యం తెగతెంపులే అన్నట్టుగానే కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి ప్రతిపక్షాలన్నీ కూటమిగా ఏర్పడే వాతావరణం కనిపిస్తున్న ఈ తరుణంలో… తన వాయిస్ పెంచడం ద్వారా, ఎన్డీయేకి దూరంగా జరుగుతూ భవిష్యత్తు రాజకీయాల కోసం తలుపులు తెరిచి పెట్టుకుంటున్నారేమో..!