సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు (సైమా) పేరుతో ప్రతీ యేటా ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. ఈసారి ‘సైమా’ వేదిక దుబాయ్కి మారింది. భారీ బడ్జెట్, కనీవినీ ఎరుగని వసతులకు `సైమా` పెట్టింది పేరు. వేదికపై ఆడిపాడిన వాళ్లకు భారీ నజరానాలను అందిస్తుంటుంది సైమా. దానికి తోడు అవార్డు విజేతలకూ ఏదో ఓ రూపంలో బహుమానాలు వెళ్తుంటాయి. అందుకే ‘సైమా’ ఫంక్షన్లో పాల్లొనడానికి స్టార్లు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఈసారి సైమాలో స్టార్ల మెరుపులు తక్కువగానే కనిపించాయి. బాలకృష్ణ, రానాని మినహాయిస్తే.. తెలుగు నుంచి స్టార్లెవరూ కనిపించలేదు. ప్రభాస్, చిరంజీవి, విజయ్ దేవరకొండ.. వీళ్లంతా ఈ కార్యక్రమానికి రావాల్సింది. కానీ.. షూటింగుల్లో బిజీగా ఉండడం వల్ల ‘సైమా’ని పక్కన పెట్టేశారు. మహేష్బాబుని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ.. అవేం సఫలీకృతం కాలేదు. అలా.. ‘సైమా’ వేదిక స్టార్లు లేకుండా కళ తప్పింది. అయితే.. డాన్సింగ్ ఈవెంట్లు బాగానే ఉండడంతో… ప్రేక్షకులకు కావల్సిన ఎంటర్టైనింగ్ దొరికినట్టైంది. సైమా స్పాన్సర్ షిప్లను బాగానే పట్టుకోగలిగింది. వాటి రూపంలో కనీసం `సైమా`కి రూ.5 కోట్ల వరకూ లాభం అంది ఉంటుందని ఓ అంచనా. స్టార్ల రాకపోకలు ఎలా ఉన్నా.. ఆర్థికంగా మాత్రం సైమాకు లాభాలు బాగానే వచ్చాయన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.