రాఫెల్ డీల్ విషయంలో కేంద్రం మరో పిల్లిమొగ్గ వేసింది. రాఫెల్ డీల్ వివరాలను తాము పీఏసికి సమర్పించామని.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదిక విషయంలో … యూటర్న్ తీసుకుంది. తాము అందించిన వివరాలను సుప్రీంకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని.. తప్పును అత్యున్నత న్యాయస్థానం మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాఫెల్ డీల్ కు సంబంధించి మొత్తం వివరాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్… కాగ్ కు ఇచ్చామని.. వారు .. పార్లమెంట్ రాజ్యాంగ వ్యవస్థ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇచ్చారని… ఆ కమిటీ మొత్తం రాఫెల్ డీల్ ను పరిశీలించిందని.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాఫెల్ డీల్ లో భారీ స్కాం జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ లను తోసిపుచ్చుతూ… సుప్రీంకోర్టు… ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. విచారణ అవసరం లేదన్నది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. పీఏసీకి రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారని… రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఫ్రెంచ్ పార్లమెంట్ లో పెట్టారా.. అని సెటైర్లు కూడా వేశారు. దీనిపై దేశవ్యాప్తంగా గగ్గోలు రేగింది. రాఫెల్ డీల్ లో స్కాం జరగబట్టే.. సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారన్న విమర్శలు ఎక్కు పెట్టాయి. బీజేపీకి అనుకూలంగా ఉండే మీడియా.. క్లీన్ చిట్ అంటూ వార్తలు రాసినా… కొన్ని మీడియా సంస్థలు మాత్రం కేంద్రం తీరును తీవ్రంగా దుయ్యబట్టాయి. పదునైన ప్రశ్నలతో ప్రజల్లోకి తీసుకెళ్లాయి. దీనిపై పీఏసీ చైర్మన్ మల్లిఖార్జున్ ఖర్గే మరింత సీరియస్ అయ్యారు. తమకు ఎలాంటి నివేదిక ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చినందున.. అటార్నీ జనరల్ తో పాటు… కాగ్ కు కూడా సమన్లు జారీ చేస్తామని ప్రకటించారు. వ్యవహారం ముదిరిపోతూండటంతో కేంద్ర ప్రభుత్వం తప్పు దిద్దుకునే ప్రయత్నంలో పడింది.
వెంటనే.. సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసుకుంది. రాఫెల్ డీల్ పై .. కాగ్ రిపోర్ట్ పీఏసికి ఇచ్చినట్లుగా.. తాము సమర్పించిన విరవాలను.. తప్పుగా అర్థం చేసుకున్నారని తీర్పులో కరెక్ట్ చేయాలని కోరుతూ.. కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కేంద్రం.. ఈ విషయంలో మొత్తానికే గేమ్ ఆడుతోందన్న విషయం వెలుగులోకి వస్తోంది. మొదటి నుంచి రాఫెల్ డీల్ పై రహస్యాలు, అబద్దాలతో కేంద్రం ప్రతిపక్షాన్ని ఉదరగొట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు విషయంలోనూ అదే జరిగినట్లు స్పష్టమయిందన్న అభిప్రాయం వ్యక్తమయింది.