ఓటుకి నోటు కేసుని వైకాపా మళ్ళీ తిరగదోడి తనని దెబ్బ తీయాలని ప్రయత్నించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆగ్రహం కలగడం సహజమే. అయితే ఆ కేసు గురించి మాట్లాడి, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే దాని గురించి మీడియాలో వార్తలు, చర్చలు మొదలయితే ఆ కేసుని స్వయంగా హైలైట్ చేసుకొన్నట్లు అవుతుంది. వైకాపా కూడా అదే కోరుకొంటోంది కనుక దానికీ తనపై దాడి చేసేందుకు బలమైన ఆయుధం అందించినట్లవుతుంది. అందుకే ఆ కేసు గురించి చంద్రబాబు చాలా ఆచితూచి క్లుప్తంగా రెండే రెండు ముక్కలు మాట్లాడి సరిపెట్టేశారు. తనకి ఈ అగ్నిపరీక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఆగ్రహం మరోవిధంగా బయటపెట్టుకొన్నారు.
కడప జిల్లాలో మాధవరం గ్రామంలో ముఖ్యమంత్రి నిన్న పర్యటించినపుడు జగన్ పై విమర్శలు తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరుగా జగన్ పేరు చెప్పకపోయినా, “మీ జిల్లాలో ఒక ఉన్మాది ఉన్నాడు. అతనికి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడం తప్ప వేరే పనేమీ లేదు. అమరావతికి అడ్డుపడుతున్నాడు. చివరికి పట్టిసీమ ద్వారా రాయలసీమకి నీళ్ళు అందించాలని మేము ప్రయత్నిస్తుంటే దానికి ఆయన అడ్డుపడుతున్నాడు. దేశంలో చాలా సీనియర్ రాజకీయ నాయకుడిని నేను. దేశానికి రాష్ట్రపతిని, ప్రధాన మంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషించినవాడిని. అటువంటి నన్ను చెప్పులతో కొట్టమని ప్రజలని రెచ్చగొడుతున్నాడు. ఏదో విధంగా నన్ను డిస్టర్బ్ చేద్దామని ప్రయత్నిస్తున్నాడు కానీ అది అతని వలన కాదు. 2003లో నాపై జరిగిన హత్యాప్రయత్నం చేసిన వ్యక్తులతో వైకాపాకి సంబంధాలు ఉన్నాయని తెలిసింది,’ అని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.
జగన్ తనని ‘డిస్టర్బ్ చేయాలని’ ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు నాయుడు చెప్పడం గమనిస్తే, జగన్ కుట్రలతో ఆయన నిజంగానే చాలా డిస్టర్బ్ అవుతున్నట్లు అర్ధం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి గత రెండున్నరేళ్ళుగా చంద్రబాబు నాయుడుని రాజకీయంగా ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎనాడూ ఆయనపై పైచెయ్యి సాధించలేకపోయారు. కానీ వైకాపా ఫ్లెక్సీ బ్యానర్స్ పై జూనియర్, సీనియర్ ఎన్టీఆర్ ల ఫోటోలు ముద్రించి ఒకసారి, ఓటుకి నోటు కేసులో అప్పుడూ ఇప్పుడూ చంద్రబాబు నాయుడుని చాలా డిస్టర్బ్ చేయగలిగారు. అయితే ఈ రాజకీయ కుట్రల వలన చంద్రబాబు చాలా డిస్టర్బ్ అవుతున్నప్పటికీ మళ్ళీ ఏదోవిధంగా బయటపడుతూనే ఉన్నారు. కనుక ఈ రాజకీయ గెరిల్లా యుద్ధంలో కూడా జగన్ ఓడిపోయినట్లే చెప్పక తప్పదు. బహుశః అందుకు వైకాపా మూల్యం చెల్లించవలసి వచ్చినా ఆశ్చర్యమేమీ లేదు.