బీఆర్ఎస్ పార్టీ తన సిద్ధాంతాలను పక్కనబెట్టి తోక పార్టీలకు తోకగా మారిపోయిందని జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. కొత్తగూడెంలో సీపీఐకి బేషరతుగా మద్దతు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. గతంలో ఏ కమ్యూనిస్టు పార్టీలనైతే కేసీఆర్ తోక పార్టీలు అని ఈసడించుకున్నారో, ఇప్పుడు అదే పార్టీలకు అడగకుండానే మద్దతు ఇవ్వడం ద్వారా కేటీఆర్ ఆ పార్టీని మరింత దిగజార్చారని ఆమె మండిపడ్డారు.
తాను ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతుంటే భరించలేక బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాన్ని అడ్డుపెట్టుకుని తనపై ట్రోల్స్ చేయిస్తున్నారని కవిత ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన మద్దతుదారులు సింహం గుర్తుపై పోటీ చేసి ఘనవిజయం సాధించారని గుర్తు చేస్తూ.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, మున్ముందు అసలు సినిమా చూపిస్తా అంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు.
రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని, తన రాజకీయ పరిశీలన ప్రకారం బీఆర్ఎస్-బీజేపీ మధ్య రహస్య పొత్తు పొడవనుందని కవిత జోస్యం చెప్పారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలే ఈ అపవిత్ర కలయికకు తొలిమెట్టు అని ఆమె వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నాయకులనే గౌరవించలేని వారు ప్రజా సమస్యలను ఏం పరిష్కరిస్తారని ప్రశ్నిస్తూ, బీఆర్ఎస్ పతనం మొదలైందని ఆమె ఎద్దేవా చేశారు.
