కొందరు రాజకీయ నేతలు కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంటే వెంటనే అదే అంశానికి సంబంధించిన వారి భాగోతాలు గుర్తుకువస్తుంటాయి. మాజీ కాంగ్రెస్ ఎంపి కావూరి సాంభశివరావు అవినీతి గురించి మాట్లాడితే ఎవరికైనా ఆయన బ్యాంకులకి ఎగవేసిన రూ.1000 కోట్లు అప్పు గురించి, దానిని వసూలు చేసుకోలేక హైదరాబాద్ లో ఆయన ఆఫీస్ ముందు బ్యాంకుల ప్రతినిధులు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని మౌన ప్రదర్శన చేయడం గుర్తుకురాక మానదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు సోనియా, రాహుల్ గాంధీలకి భజన చేసిన ఆయన రాష్ట్ర విభజన కారణంగా ఓడిపోబోతోంది అని పసిగట్టగానే తెదేపాలోకి దూకేయాలని ప్రయత్నించి అది సాధ్యం కాకపోవడంతో భాజపాలోకి దూకేశారు.
అటువంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగానే ఉంటుంది. ప్రత్యేక ప్యాకేజి కారణంగా రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటున్న భాజపాని కాపాడేందుకు ఆ పార్టీ నేతలు అందరూ రంగంలోకి దిగుతున్నారు. వారితో బాటు రంగంలోకి దిగిన కావూరి సాంభశివరావు మీడియాతో మాట్లాడుతూ, “నరేంద్ర మోడీ అధిఅకరం చేపట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వంలో అవినీతి చాలా వరకు తగ్గిపోయింది. రెండున్నరేళ్ళ మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం గమనిస్తే ఆయన పాలన ఎంత స్వచ్చంగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలలో కూడా అటువంటి అవినీతిరహితమైన పాలన సాగాలని మేము కోరుకొంటున్నాము. అందుకు కృషి చేస్తున్నాము,” అని అన్నారు.
ఈ మాటలు విన్నప్పుడు అందరూ ఏమనుకొంటారో వేరేగా చెప్పనవసరం లేదు. మోడీ ప్రభుత్వ పాలనలో అవినీతి తగ్గిన మాట వాస్తవమే. రాష్ట్ర స్థాయిలో కూడా అవినీతిని అరికట్టవలసిన అవసరం ఉంది. కానీ ముందుగా ఆ బ్యాంకుల దగ్గర తీసుకొన్న డబ్బుని కావూరి తిరిగి చెల్లించారో లేదో? చెల్లించకపోయుంటే ముందు దానిని చెల్లించేసి ఈ మాటలు చెపితే బాగుంటుంది కదా.