తెలంగాణలో నగదు రహిత విధానాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నిస్తోంది. క్యాష్ లెస్ లావాదేవీలకు ప్రోత్సాహం, టి వాలెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం భేటీ అయింది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్యాష్ లెస్ లావాదేవీల విషయంలో సిద్దిపేట నియోజకవర్గంలోని తాజా పరిస్థితిని కూడా చర్చించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రచార ప్రక్రియ ఎలా ఉండాలనేదానిపై పలు సూచనలు వచ్చాయి. టెక్నాలజీని వీలైనంత ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల సలహాలను మంత్రులు ఆహ్వానించారు.
టి వ్యాలెట్ ను సమర్థంగా అమల్లోకి తీసుకొస్తే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందని కేటీఆర్ చెప్పారు. వివిధ శాఖలు, సేవలకు చెల్లింపుల కోసం ఒకే యాప్ రూపొందించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దేశంలో అత్యధికంగా క్యాష్ లెస్ లావాదేవీలు జరిపే రాష్ట్రంగా తెలంగాణను నిలపడానికి అందరూ సహకరించాలని కేటీఆర్ కోరినట్టు సమాచారం.