తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చర్చకు వేదిక కావాలే తప్ప రచ్చ జరగకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే తన ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నారు. ప్రతిపక్షాలు అర్థవంతమైన చర్చకు సహకరిస్తే అడిగినన్ని రోజులు సమావేశాలు జరపడానికి సిద్ధమని ఆయన ఇదివరకే చెప్పారు. ఒకవేళ రచ్చ జరిగితే మాత్రం త్వరగా సమావేశాలకు ముగింపు పలకాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. సోమవారం ప్రగతిభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలోనూ ఆయన ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారని తెలుస్తోంది.
ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను ముందుగానే ఊహించి ఓ జాబితా సిద్ధం చేసుకోవాలి. శాఖల వారీగా మంత్రులు వివరాలను తెలుసుకుని ప్రిపేర్ కావాలి. కొందరు ఎమ్మెల్యేలుకూడా సబ్జెక్టుల వారీగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి. విపక్షాలపై ఎదురు దాడి సమయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా సమర్థంగా మాట్లాడాలి. సబ్జెక్టుపై పూర్తి అవగాహనతో చర్చించడం ద్వారా ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో ప్రజలకు తెలిసేలా జాగ్రత్తలు తీసుకోవాలి… ఇవీ సమీక్ష సందర్భంగా కేసీఆర్ చేసిన సూచనలు.
ఈనెల 16 నుంచి నెలాఖరు వరకు సమావేశాలను జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ తర్వాత సభ జరిగే తీరునుబట్టి సమావేశాలను పొడిగించడంపై నిర్ణయం తీసుకుంటారు. రైతులు, విద్యార్థుల సమస్యలు, డబుల్ బెడ్ రూం తదితర హామీలను అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వాటికి దీటుగా బదులివ్వడానికి కేసీఆర్ తన పార్టీ వారిని సన్నద్ధం చేస్తున్నారు.