ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు ఖాయమే..! దూకుడుగా కేసీఆర్..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. టీఆర్ఎస్‌ను ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారు. రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతి రెడ్డి అనే ఎమ్మెల్సీలు… టిక్కెట్ల పంపిణీ.. టీఆర్ఎస్‌లో అంతర్గత వ్యవహారాల కారణంగా.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. బంపర్ మెజార్టీతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్నికల సమయంలో తమను ఇబ్బంది పెట్టిన వారిపై దృష్టి పెట్టారు. ముందుగా తమ పార్టీలో పదవులు పొంది.. ఎన్నికల సమయంలో హ్యాండిచ్చి .. కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై గురి పెట్టారు. వారిపై.. ఏ క్షణమైనా అనర్హతా వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఇక నిర్ణయం తీసుకోవడం లాంఛనమే.

ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్‌లో ఉన్నారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన బాజిరెడ్డి గోవర్ధన్ కోసం సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బాజిరెడ్డి ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోయారు. డీఎస్‌తో సన్నిహితంగా ఉండటంతో… మెల్లగా దూరం చేశారు. సస్పెండ్ చేయాలన్న తీర్మానం చేసి పార్టీ నుంచి దూరం పెట్టారు. కానీ.. బహిష్కరించలేదు.చివరికి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి నిజామాబాద్ రూరల్ టిక్కెట్ తెచ్చుకున్నారు. కానీ బాజిరెడ్డి చేతిలోనే పరాజయం పాలవ్వాల్సి వచ్చింది. ఇక యాదవరెడ్డి… కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సన్నిహితుడు. ఆయన మేడ్చల్‌లో సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందే ఆయనను టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఇక రాములు నాయక్… నారాయణఖేడ్ టిక్కెట్ ను ఆశించారు. కానీ ఇవ్వకపోవడంతో… కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసి.. కాంగ్రెస్‌లో చేరిపోయారు. వీరి ముగ్గురిపై వేటు వేయబోతున్నారు.

తెలంగాణ శాసన మండలిలో మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయడం లాంఛనమే. కొడంగల్ నుంచి గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి గెలిచిన మైనంపల్లి హనుమంతరావులు రాజీనామాలు చేయనున్నారు. అంటే మొత్తంగా.. శాసనమండలిలో ఐదు స్థానాలు ఖాళీ అవుతాయి. వీటిలో… ఎన్నికల్లో ఓడిన సీనియర్లు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మధుసూదనాచారి లాంటి వాళ్లకు ఈ స్థానాల్లో అవకాశం ఇవ్వునున్నారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.