అసెంబ్లీకి అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించి…. ఓ భారీ ప్రయోగం చేసి.. సంచలన విజయం నమోదు చేశారు కేసీఆర్. ఇప్పుడు అదే వ్యూహం.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రయోగిచబోతున్నట్లు.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మిత్రపక్షం ఎంఐఎంకు ఒకటి వదిలేసి.. పదహారు సీట్లలోనూ గెలుపు సాధించాలని.. కేసీఆర్ ఇప్పటికే పట్టుదలగా ఉన్నారు. సిట్టింగుల వ్యూహాన్ని పార్లమెంట్లో కొనసాగిచినా.. కొన్ని స్థానాల్లో కొత్త వారిని వెదుక్కోక తప్పని పరిస్థితి ఉంది. బాల్క సుమన్, మల్లారెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో.. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులు.. అలాగే గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో బలమైన నేతల్ని కేసీఆర్ ఇప్పటికే గుర్తించారని చెబుతున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్ధిగా వినోద్ కుమార్ ను సిరిసిల్లలో ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మరికొంత మంది సిట్టింగ్లకు అనుకూలంగా ప్రకటనలు చేశారు. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడటంతో ఇప్పుడు ఆ స్థానం నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దించాల్సి ఉంది. తాండూరు నుంచి ఓడిపోయిన మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఖరారు చేశారని చెబుతున్నారు. మల్కాజ్ గిరి నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. పదహారు లోక్ సభ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న గులాబీ బాస్ ….సికింద్రాబాద్ పై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. అజహరుద్దీన్ ను పార్టీలో చేర్చుకుని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు.
నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పేరు ప్రచారంలోకి రావడం కొత్త పరిణామం. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్.. లోక్ సభకు పోటీ చేస్తారని చెబుతున్నారు. గుత్తా మాత్ర పోటీకి సిద్ధంగా లేరు. నాగర్ కర్నూల్ సీటు ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉంది. ఇక్కడినుంచి మాజీ ఎంపీ మందా జగన్నాధం, మాజీ మంత్రి పి. రాములు టిక్కెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి టిక్కెట్ ను మాజీ ఎంపీ వివేక్ ఆశిస్తున్నారు. ఆయనను దూరం పెట్టాలనుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం టీఆర్ఎస్ లో కనిపిస్తున్నాయి. ఖమ్మం లోక్ సభ నుంచి ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వల్ల చాలా నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులు ఓడిపోయారన్న ప్రచారం ఉంది. ఆయనకు కూడా డౌటేనంటున్నారు. మిగతా స్థానాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చనే చర్చ పార్టీలో జరుగుతోంది.