కేరళ ఎదుర్కొంటున్న కష్టం ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తోంది. ముఖ్యంగా కేరళ వాసులతో అవినావభావ సంబంధం ఉన్న… ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా… కేరళకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నాయి. విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. కేరళ వాసులు అత్యధికంగా గల్ఫ్లో ఉంటారు. ప్రభుత్వాలతో సహా అనేక రంగాల్లో కేరళ వాసులు… సేవలు అందిస్తూ ఉంటారు. ఆ కృతజ్ఞతతో యూఏఈ రాజు రూ. 700 కోట్లు, ఖతర్ ప్రభుత్వం రూ. 35 కోట్లు విరాళాలు ప్రకటించాయి. అయితే విదేశీ విరాళాలు కేరళ అందుకోవాలంటే… కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. ఈ విరాళాలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని.. కేంద్రం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేరళ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది కేంద్రం. తక్షణ సహాయ కార్యక్రమాలకు రూ. 2500 కోట్లను ఇవ్వాలని… కేరళ .. కేంద్రాన్ని కోరింది. కానీ రూ. 600 కోట్లను మాత్రమే ప్రకటించింది. దీంతో కేరళ ప్రభుత్వం పౌరులను విరాళాలు కోరింది. దేశ ప్రజలు… రూ. వంద దగ్గర్నుంచి… తమకు తోచినంత విరాళాలు పంపుతూనే ఉన్నారు. అయినా కేరళ కష్టం తీరేలా కనిపించడం లేదు. ఇప్పుడు అభిమానంతో ఇతర దేశాలు ఇస్తామంటున్న విదేశీ విరాళాలను స్వీకరించడానికి అనుమతి ఇవ్వకూడదని… కేంద్రం భావించడం కొత్త విమర్శలకు దారి తీస్తోంది. కేంద్రం పెట్టదు.. పెట్టనివ్వడం లేదని… కేరళ వాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తమ దేశ ఆర్థిక వ్యవస్థలో… కేరళ వాసులు కీలక పాత్ర పోషిస్తారన్న అభిమానంతోనే… గల్ఫ్ దేశాలు… విరాళాలు ప్రకటించాయి కానీ.. ఇండియాపై జాలితో కాదు. కేరళను ఇండియా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న కారణంతో కాదు. ఆరెస్సెస్ అనుబంధ సంఘాలు కొన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నట్లుగా.. గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు మత ప్రచారాలు చేయవు. అయినా… గల్ఫ్ దేశాల విరాళాలను కేంద్రం ఆపేయాలనుకోవడానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 600 కోట్లు ఇస్తే.. యూఏఈ అంత కంటే ఎక్కువగా రూ. 700 కోట్లు ఇవ్వడంతో తమ పరువు పోయినట్లయిందని బీజేపీ భావిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఒక్క రూపాయి విరాళం రాకుండా చేస్తే సరిపోతుందన్న ఆలోచన చేస్తోందంటున్నారు. గల్ఫ్ దేశాల విరాళాలకు కేరళకు రాకుండా చేస్తే మాత్రం.. కేంద్రం తాను పెట్టదు.. ఇతరులను పెట్టనివ్వదన్న విషయం మాత్రం నిజమవుతుంది.