నక్షత్రం ఫ్లాప్తో కృష్ణ వంశీ మాయమైపోయాడు. ఆ తరవాత కనీసం సినిమా వేడుకల్లోనూ కనిపించలేదు. నక్షత్రం కంటే ముందు కృష్ణవంశీకి పెద్ద పెద్ద డిజాస్టర్లే తగిలాయి. కానీ నక్షత్రం దెబ్బ వేరు. అందులోంచి తేరుకోవడానికి చాలా టైమ్ పట్టేట్టుంది. ఇప్పుడు అందులోంచి బయట పడి ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈసారి కూడా `చందమామ` టైపులో ఓ పల్లెటూరి కథ ఎంచుకున్నాడట. అందుకోసం ఇద్దరు కొత్త హీరోల్ని వెదికి పట్టుకునే పనిలో ఉన్నాడు. కథ దాదాపుగా సిద్ధమైందని, ఇక నిర్మాత దొరకడమే ఆలస్యమని సమాచారం. కృష్ణవంశీ ఎన్ని ఫ్లాపులు తీసినా.. నిర్మాతని పట్టడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. పల్లెటూరి కథ, అందులోనూ కొత్త హీరోలు కాబట్టి మినిమం బడ్జెట్లో లాగించేయొచ్చు. కాకపోతే ఆ కథ ఎంత స్ట్రాంగ్గా ఉన్నదన్నదే కీలకం. అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు, ఈసారి కూడా డింకీ కొడితే ఇక అంతే సంగతులు. అందుకే కృష్ణవంశీ కూడా సినిమా తీసే విషయంలో ఏమాత్రం తొందర పడడం లేదని, అన్నీ ఓకే అన్నాకే రంగంలోకి దిగడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. త్వరలో కృష్ణవంశీ నుంచి ఓ తీపి కబురు వినొచ్చు.