ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టి రాష్ట్రంలో మళ్ళీ ప్రత్యేక వేడి పుట్టించిన కెవిపి రామచంద్ర రావు, దాని తరువాత ఇప్పుడు అటువంటిదే మరో పెండింగ్ హామీ-పోలవరం ప్రాజెక్టుని టేకప్ చేసినట్లున్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఒక్కో అంశంపై పోరాటం చేస్తున్నప్పటికీ, దాని వలన కేంద్రప్రభుత్వంలో కదలిక ఏర్పడుతోంది కనుక ఆయన ప్రయత్నాలని స్వాగతించక తప్పదు. ఆయన నిన్న డిల్లీలో పోలవరం ప్రాజెక్టు గురించి మీడియాతో మాట్లాడినప్పుడు చాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“పోలవరం ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేయరు. కేంద్రప్రభుత్వం కూడా దాని గురించి చొరవ తీసుకోదు. ఆ ప్రాజెక్టు గురించి నేను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి వ్రాసిన లేఖకి బదులే ఇవ్వలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే అవి రెండూ కలిసి పోలవరం ప్రాజెక్టుని అటకెక్కించేయాలని నిశ్చయించుకొన్నట్లు అనుమానం కలుగుతోంది,” అని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఉన్నందున దానిని పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. కానీ దానికోసం ఇచ్చిన నిధులకి రాష్ట్ర ప్రభుత్వం సరైన లెక్కలు చెప్పడం లేదనే సాకుతో అవసరమైన నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్ర భాజపా నేతలు అదే విషయం పదేపదే మీడియా ముందు గట్టిగా ప్రస్తావిస్తున్నప్పటికీ, ఏపి మంత్రులు కానీ తెదేపా నేతలు గానీ వారి లెక్కల ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా కేంద్రప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని ఆరోపిస్తుంటారు.
సుమారు ఏడాదిగా వారి మధ్య ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ రెండు పార్టీలు తమ యుద్ధాలతో ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప దానిలో ఎదురవుతున్న సమస్యలని పరిష్కరించుకొని ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నించడం లేదు..కనీసం ఆలోచించడం లేదు. అందుకే రెండేళ్లుగా పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. బహుశః మిగిలిన మూడేళ్ళు కూడా ఆ రెండు పార్టీల నేతలు బహుశః ఇదేవిధంగా పోరాడుకొంటూ ప్రజలను మభ్యపెడుతూ రోజులు దొర్లించేసినా ఆశ్చర్యం లేదు.
ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్, వైకాపాలు ఇప్పటికే ప్రజలని ఆకట్టుకోగలిగాయి. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్, రాజధాని నిర్మాణం వంటి అంశాలలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే ప్రజలని మభ్యపెట్టాలని చూస్తే, వచ్చే ఎన్నికలలో అవే కాంగ్రెస్, వైకాపాలకి ఆయుధాలుగా, గొప్ప వరాలుగా మారడం తధ్యం. రెండేళ్ళ క్రితం ఏ అంశాలు లేదా హామీలు తెదేపా-భాజపాలకి వారాలుగా మారాయో, వచ్చే ఎన్నికలలో సరిగ్గా అవే వాటికి శాపాలుగా ప్రతిపక్షాలకి వరాలుగా మరే అవకాశం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహిస్తే మంచిది.