పవన్ కల్యాణ్ పోరాట యాత్ర ఓ జిల్లాలో ముగిసింది. విజయనగరం జిల్లాకు చేరుకుంది. బొబ్బిలిలో ఒక రోజంతా.. ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. బొబ్బిలి చేరుకున్నప్పటి నుంచి ఆయన..చర్చల్లోనే గడిపారు. పోరాట యాత్ర షెడ్యూల్ ..ఏ ఏ నియోజకవర్గాల నుంచి వెళ్లాలి అన్నదానిపై… సుదీర్ఘ చర్చలు జరిగాయని జనసేన నేతలు చెబుతున్నారు. అదేంటి.. ఓ జిల్లాలోకి పోరాటయాత్ర వచ్చే వరకూ.. రూట్ మ్యాప్ ఖరారు చేసుకోలేదా..? లాంటి డౌట్లు రాజకీయవర్గాలకు వస్తున్నాయి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా అన్నట్లు.. ఒక జిల్లా పూర్తయిన తర్వాతే మరో జిల్లా గురించి ఆలోచించాలి అని డిసైడయినట్లున్నారు.
కనీసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా..పార్టీలో పెద్ద నేతలుగా చెప్పుకున్న వారంతా ఏం చేస్తున్నారు..? . పవన్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయలేరా.. అనేది సగటు జనసేన కార్యకర్తల అనుమానం. కానీ అలాంటి అవకాశం పవన్ కల్యాణ్ ఇవ్వరనేది జనసేనలో పై స్థాయి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లాలో పోరాటయాత్ర ప్రారంభిస్తున్న ముందు రోజు వరకూ.. జనసేనలో ఓ మాదిరి నేతలుగా చెప్పుకున్న వారెవరికీ షెడ్యూల్ తెలియదు. ఆయన ఏ రోజు .. ఏ నియోజకవర్గంలో యాత్ర చేస్తారన్నదానిపైనా.. అంతకు ముందు రోజు మాత్రమే క్లారిటీ వస్తుంది. ప్రారంభమయ్యే వరకూ.. ఆ రోజు పోరాటయాత్ర ఉంటుందో .. ఉండదో.. జనసేన టీమ్ కు కూడా సందేహమే.
ఉత్తరాంధ్రలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో 45 రోజులు పర్యటన షెడ్యూల్ ఉంటుందని జనసేన వర్గాలు మీడియాకు చెప్పాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు రోజులు పవన్ కల్యాణ్ పర్యటిస్తారని చెప్పారు. కానీ శ్రీకాకుళం యాత్ర మొత్తాన్ని ఆరు వారం రోజుల్లో పూర్తి చేశారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఒక్క రోజు దీక్ష చేశారు. ఇవన్నీ.. అప్పటికప్పుడు అనుకున్నవే. ఒక్కటీ ప్లాన్ ప్రకారం జరగలేదు. శ్రీకాకుళం జిల్లాలో పవన్ కల్యాణ్ చెప్పుకోవడానికి ఉద్దానం సమస్య దొరికింది. దాని కోసం తను చేసిన ప్రయత్నానికి అప్పట్లో ప్రభుత్వం మద్దతు లభించడంతో…బాధితులకు కొంత సాయం అందింది. దాన్ని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవడానికి..యాత్ర మొత్తం ప్రయత్నించారు. ప్రతి సభలోనూ ఉద్దానం విషయాన్ని ప్రస్తావించారు.
ఇక రాజకీయం అంటే అధికార పార్టీనే తిట్టడం అన్నట్లు తెలుగుదేశం పార్టీపైన, చతంద్రబాబుపై నోటికొచ్చినన్ని ఆరోపణలు చేశారు. అన్నీ పవన్ లెక్కలో జనం అనుకుంటున్నవే. మరి విజయనగరం జిల్లాలో ఎం చెబుతారు..?. తాను పార్టీ పెట్టి నాలుగేళ్లయినా.. విజయనగరం కోసం.. చేసింది ఏమీ లేదు. ఒక్క సమస్యపైనా పోరాడింది లేదు..! మరెం చెప్పుకుంటారు..?. అసలు రూట్ మ్యాపే జిల్లాకు వచ్చిన తర్వాత ఖరారు చేసుకుంటూంటే.. ఇక అవన్నీ ఎప్పుడు ఆలోచిస్తారనేది..జనసేన కింది స్థాయి నేతల ఆవేదన. పవన్ కల్యాణ్.. దాహమేసినప్పుడు .. బావి తవ్వుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. ముందు జాగ్రత్త పడటం లేదనేది.. పోరాటయాత్రను పరిశీలిస్తున్న వారు అంచనా వేస్తున్న నిజం.
—సుభాష్