ఆంధ్రప్రదేశ్ లో నేటికీ తెదేపా-భాజపాలు మిత్రపక్షాలుగానే వ్యవహరిస్తున్నాయి కనుక తెదేపాతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియక రాష్ట్ర భాజపా నేతలు అయోమయం చెందడం సహజమే. కానీ తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాసతో భాజపాకి ఎటువంటి స్నేహం లేనప్పటికీ దాని విషయంలో కూడా వారు అయోమయ వైఖరితోనే ఉండటం విశేషం. అందుకు కారణం తెరాస ప్రభుత్వంతో భాజపా అధిష్టానం ఒకలాగా, కేంద్రప్రభుత్వం మరొకలాగ వ్యవహరిస్తుండటమేనని చెప్పవచ్చు.
కేంద్రమంత్రులు-తెరాస మంత్రులు మధ్య చక్కటి సంబంధాలు కొనసాగుతుంటే, తెరాస-భాజపాలు రాజకీయ శత్రువులులాగే వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకి గజ్వేల్ సభకి, దానికి గంటసేపు తరువాత హైదరాబాద్ లో జరిగిన భాజపా సభకి మద్య కనబడిన తేడా గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. ఈ కారణంగా భాజపాలో ఒక అయోమయ వైఖరి నెలకొని ఉందనే భావన సర్వత్రా నెలకొని ఉంది. తెరాస పట్ల భాజపా వైఖరిని స్పష్టం చేసి, రాష్ట్ర భాజపా నేతలకి, కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రయత్నించారు.
ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోడీ మిషన్ భగీరథ పధకాన్ని ప్రారంభించారంటే అది కేవలం ప్రధానిగా తన బాధ్యత అని భావించినందునే తప్ప తెరాస ప్రభుత్వానికి పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చినట్లు భావించడం తప్పే..తెరాసతో పొత్తులకి మాపార్టీ అర్రులు చాస్తున్నట్లు భావించడం కూడా తప్పే. దేశాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు నెలకొల్పడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా మంచిపనులు చేస్తే వాటికి అన్ని విధాల సహాయసహకారాలు అందింఛి ప్రోత్సహించడం తన బాధ్యతని ప్రధాని మోడీ భావిస్తుంటారు. అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానించగానే ఆయన మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చారు. తెలంగాణాలో కుటుంబ పాలన సాగుతోంది. అదీ చాలా నిరంకుశ, అప్రజాస్వామిక విధానాలు అమలుచేస్తోంది. కనుక మేము ప్రజల తరపున దానితో పోరాడుతామే తప్ప దానితో చేతులు కలిపే ప్రసక్తే లేదు,” అని మురళీధర్ రావు చెప్పారు.
ఒకప్పుడు చంద్రబాబు నాయుడు “ప్రభుత్వాలుగా సహకరించుకొందాము, పార్టీలుగా ఎవరిపని వారు చేసుకుపోదాము,” అని కెసిఆర్ కి పదేపదే చెప్పేవారు. ఇప్పుడు కెసిఆర్ అదే పద్దతిని కేంద్రప్రభుత్వం-భాజపాలతో అమలుచేస్తున్నట్లున్నారు. ఆ పద్ధతి ప్రకారమే భాజపా కూడా సాగితే చివరికి దానికీ తెలంగాణా తెదేపా గతే పట్టవచ్చు. ఒకవేళ తెరాసతో భాజపా పొత్తులు పెట్టుకొన్నా అది ఏపిలో తెదేపాకి ఏవిదంగా తోక పార్టీగా మిగిలిపోయిందో, అక్కడా అలాగే మిగిలిపోవచ్చు. కనుక తెలంగాణాలో భాజపా ఏవిధంగా ముందుకు వెళ్ళాలో ఆలోచించుకొంటే మంచిది.