టాలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ సినిమాలు తీస్తున్న అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీస్ ఒకటి. శ్రీమంతుడు, జనగా గ్యారేజ్లతో సూపర్ హిట్లు కొట్టారు. ‘రంగస్థలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. సవ్యసాచి సెట్లో ఉంది. చేతి నిండా ప్రాజెక్టులతో నిత్యం వార్తల్లో ఉంటోంది మైత్రీ. అయితే ఈ సంస్థకు కొత్త ఓ తలనొప్పి పట్టుకుంది. తమ గ్యాంగ్ లో లీకు వీరులున్నారన్న సంగతి తెలిసి… వాళ్ల టెన్షన్ పట్టుకుంది. మీడియాకు వార్తలు ఇచ్చే ముందే… ఓ వర్గానికి లీకులు అందుతున్నాయి. మొన్నటికి మొన్న ‘రంగస్థలం’ మూడో పాటకు మీడియాలో ఓ వర్గానికి ముందే లీకైంది. దాంతో.. వాళ్లు వార్తలు వండేశారు. పాజిటీవ్గా వార్తలు రాస్తే ఫర్వాలేదు. మరీ డబ్బింగ్ సినిమాలో పాటలా ఉంది` అంటూ… నెగిటీవ్ వార్తలు పుట్టించారు. పాట అఫీషియల్గా బయటకు రాకుండానే దానిపై నెగిటీవ్ వార్తలు రావడం చిత్రబృందంలో కలవరం రేకెత్తించింది.
నిజానికి మూడో పాట ‘రంగమ్మ మంగమ్మ’ కూడా సూసర్ హిట్టే. ఐటెమ్ గీతం కూడా ముందే లీకవ్వడం.. దానిపై కూడా నెగిటీవ్ వార్తలు రావడం.. చిత్రబృందాన్ని టెన్షన్లో పడేసింది. నాగచైతన్య ‘సవ్యసాచి’ లుక్ అధికారికంగా బయటకు వచ్చే ముందే… లీకైంది. దీనిపై కూడా కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాశాయి. దాంతో కావాలనే ఎవరో తమ సినిమాలపై నెగిటీవ్ వార్తలు పుట్టించడానికి సమాచారాన్ని ముందే లీక్ చేస్తున్నారన్న గుబులు పట్టేసింది మైత్రీకి. తమలో లీకు వీరులు ఎవరున్నారో.. నిర్మాతలు ఆరా తీస్తున్నారు. పీఆర్వోల ద్వారా రావాల్సిన సమాచారం ముందే బయటకు ఎలా వచ్చేస్తోంది? సెట్లో వార్తలు సరే సరి.. కానీ పాటలు, ఫస్ట్ లుక్లూ ఎలా అందేస్తున్నాయి? అనే కలవరంలో ఉంది మైత్రీ మూవీస్. దీనికి కారకులు ఎవరైనా సరే.. వాళ్లపైచర్యలు తీసుకోవాలని మైత్రీ మూవీస్ భావిస్తోందని సమాచారం. మరి సొంతింట్లోనే కుంపటి పెడుతున్న వ్యక్తులు ఎవరన్నది తేలాల్సివుంది.